Ayaansh Gupta: హైదరాబాదుకు చెందిన మూడేళ్ల బాలుడి ప్రాణాలు నిలపడానికి దాతలు పోటీపడ్డారు.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్ కొనుగోలుకు లక్షల రూపాయల విరాళాలు ఇచ్చారు.వారందరి సాయంతో ఆ ఇంజెక్షన్ ని ఆ బాలుడి తల్లిదండ్రులు కొనుగోలుచేయడమే కాకుండా శుక్రవారం ఇప్పించారు.హైద్రాబాద్ రెయిన్ బో హాస్పిటల్ లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.వివరాల్లోకి వెళితే…
అరుదైన వ్యాధికి అతి ఖరీదైన ఇంజక్షన్!
హైదరాబాద్ కి చెందిన ఆయాన్స్ అనే బాలుడికి అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రఫీ(ఎస్ఎంఎ) అనే వ్యాధి సోకింది.అది నయం కావాలంటే వాడాల్సింది ఒకేఒక ఇంజెక్షన్ ఆని వైద్యులు తేల్చారు.అయితే అది ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన ఇంజక్షన్.దాని ధర అక్షరాలా పదహారు కోట్ల రూపాయలు అంటే నమ్మశక్యం కాకపోవచ్చు గానీ ఇది నమ్మి తీరాల్సిన నిజం.అమెరికాలోని నోవార్టిస్ కంపెనీ తయారుచేసే zolgensma అనే ఈ ఇంజెక్షన్ ఒక్కటే ఆ వ్యాధికి పనిచేస్తుందని రుజువైంది.
సోషల్ మీడియాలో తల్లిదండ్రుల అభ్యర్థన
అయితే పదహారు కోట్ల రూపాయలు చిన్న మొత్తం కాదు. ఆ బాలుడి తల్లిదండ్రులకి అంత ఆర్థిక స్థోమత లేదు.ఛత్తీస్ గఢ్ కు చెందిన యోగేశ్ గుప్తా, రూప గుప్తాలు ఉద్యోగాలు చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ తరుణంలో వారి కుమారుడు ఆ వ్యాధి బారిన పడ్డాడు.అయితే డాక్టర్లు ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ కావాలని చెప్పారో తల్లిదండ్రులు తెలివిగా ఆలోచించి సోషల్ మీడియా వేదికగా వివిధ వర్గాల వారికి ఆర్థిక సహాయం చేయమంటూ అభ్యర్థనలను పంపారు.తమ ఆర్థిక పరిస్థితిని, బాలుడి విషమ స్థితిని కూడా వారు సోషల్ మీడియాలో వివరించారు.ఫిబ్రవరి ఇరవై నాలుగున వారు ఈ క్రౌడ్ పుల్లింగ్ కార్యక్రమం చేపట్టారు.
స్పందించిన హృదయాలు!
ఆ తల్లిదండ్రుల దీనస్థితికి మనసున్న వారి హృదయాలు కదిలిపోయాయి.భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా పలువురు క్రికెటర్లు,అనేక మంది సంపన్నులు విరాళాలు కుమ్మరించారు.మే ఇరవై నాలుగో తేదీకల్లా అంటే రెండున్నర నెలల్లో వారికి కావల్సిన పదహారు కోట్ల రూపాయలు సమకూరాయి.వెంటనే ఆ ఇంజెక్షన్ కు ఆర్డర్ ఇచ్చారు.జూన్ ఎనిమిదివ తేదీన ఇంజెక్షన్ హైద్రాబాద్ చేరుకొంది.కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో తన వంతు సహాయం చేసింది.సుమారు ఆరు కోట్ల రూపాయల విలువచేసే దిగుమతి సుంకాన్ని జిఎస్టీని రద్దు చేసింది.
Ayaansh Gupta: హ్యాపీ గా డిశ్చార్జ్ అయ్యాడు!
శుక్రవారం ఉదయం ఆ బాలుడికి ఇంజక్షన్ విజయవంతంగా రెయిన్బో ఆస్పత్రి వైద్యులు ఇచ్చారు. సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో బెట్టి అంతా బాగుందని వారు సంతృప్తి చెందాక బాలుడిని డిశ్చార్జ్ చేశారు.అయితే రెండు నెలల పాటు అతి జాగ్రత్తగా బాలుడిని చూసుకోవాలని, ఇంజెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, అందువల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని రెయిన్ బో వైద్యులు బాలుడి తల్లిదండ్రులకు సలహా ఇచ్చి పంపారు.తమ కుమారుడికి కొత్త జీవితం ప్రసాదించడానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.