తనది సీఎంపై కోపం కాదని, బాధ మాత్రమే అని చెప్పడానికి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.నిజానికి ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అంటున్నారు.
కోపమైతే ఆ సంగతి, దాని వెనకున్న ఆయన ఆలోచన వేరుకావచ్చు కానీ నిజంగా అది బాధ అయితే మాత్రం దాన్ని వ్యక్తపరిచే విధానం మాత్రం అది కాదని వారు స్పష్టం చేస్తున్నారు దానివల్ల నష్టం ఎవరికన్నది విజ్ఞులైన ఎంపీగారే ఆలోచించుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు.అనేక సందర్భాల్లో వైసీపీ రామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వ విధానాలను విమర్శించడమే కాకుండా ఈ మధ్య ముఖ్యమంత్రిపై కూడా సూటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే .ఇసుక పేరు చెప్పి జగన్ ను పొగుడుతూనే తనదైన గోదావరి జిల్లా వెటకారంతో చెప్పాల్సిన విషయం చెప్పే ప్రయత్నం చేశారు ఈ వైకాపా ఎంపీ!
అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడంపై వైకాపా నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నంత పనిచేస్తుంటే… అలా అరెస్టు చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్నస్థాయిలో రఘురామ కృష్ణం రాజు మాట్లాడారు! ఆయన ఇసుక విషయంలో అధికారులను అన్నా.. అచ్చెన్న అరెస్టు విషయంలో ఏసీబీ ని అన్నా… తగిలేది జగన్ కే అన్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… ఆయన ధిక్కార స్వరం కాస్త పెంచారన్న క్లారిటీ మాత్రం చాలా మందికి వస్తుంది!ముఖ్యమంత్రి చుట్టు ఉన్న కోటరీ తన లాంటి వారిని సీఎం దగ్గరకు రానివ్వడం లేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప మిగతా వారిని సీఎం కూడా కలవడం లేదని చెబుతూ… సీఎం అంటే తనకు అత్యంత గౌరవం అని తెలిపారు. సీఎం ను కలవనివ్వకుండా కొందరు అడ్డు పడుతున్నారంటున్నారు.అది కచ్చితంగా పార్టీ అంతర్గత వ్యవహారం.దాన్ని బహిరంగంగా మీడియాకు రఘురామ కృష్ణం రాజు చెప్పడం కూడా జగన్కు కొంత ఇబ్బందేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.మొత్తం మీద రఘురామకృష్ణంరాజు లక్ష్మణరేఖ దాటారని దాని పరిణామాలను ఆయన జగన్ పరంగా ఎదుర్కొవాల్సివుంటుందని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.