“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు..” అనే పాట వినేవుంటారు. నిజమే పట్టుదల, కృషిని నమ్ముకుంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే నేపథ్యంలోనే పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యమంటూ ఏమీ ఉండబోదని నిరూపించాడు ఓ విద్యార్థి. చెత్త సేకరించి తన కుటుంబాన్ని పోషిస్తున్నన తన తండ్రిని బికారి అంటూ అవమానించిన వారికి.. తగిన బుద్ది చెప్పాడు ఆ విద్యార్థి. ఎలా బుద్దిచెప్పాడు? ఎలా అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు అనుకుంటున్నారా?
ఇటీవల విడుదలైన నీట్-2020 ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన అరవింద్ 620 మార్కులు సాధించి, జాతీయ స్థాయిలో 11,602 ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 4,392వ ర్యాంకు దక్కించుకున్నాడు. యూపీలోని కుషీనగర్ పరిధిలో గల బర్డీ గ్రామానికి చెందిన అరవింద్.. కుటుంబం చెత్త ఏరుకుని జీవనం సాగిస్తుంది. అరవింద్ తండ్రి భిఖారీ కుమార్ ఇళ్లలోని పాత సమాన్లు కొనుగోలు చేస్తుంటారు. తల్లిదండ్రులు తమ కుమారుడు డాక్టర్ కవాలని వారు కలలుకనేవారు. దీని కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూనే కుమారుడిని చదివించారు.
అయితే, తొలిప్రయత్నంలోనే అరవింద్కు ఈ ర్యాంకు రాలేదు. పలుమార్లు విఫలమైన పట్టువదలకుండా ప్రయత్నించడంతో ఇప్పుడు విజయాన్ని అందుకున్నారు. గోరఖ్పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే సమయంలో 8 కిలోమీటర్ల దూరం సైకిల్ పై చదువు అభ్యసించాడు. 10వ తరగతిలో 48శాతం, 12 వ తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తక్కువ మార్కులతో చదువులు గట్టెక్కుతున్నప్పటికీ డాక్టర్ కావాలన్న బలమైన పట్టుదలతో నీట్ పరీక్షకు సిద్ధమై మంచి ర్యాంకు సాధించాడు.
దీనిపై అరవింద్ మాట్లాడుతూ.. డాక్టర్ కావడం తన లక్ష్యమని అన్నాడు. అలాగే, సంవత్సరాలుగా తన కుటుంబం అనేక అవమానాలను ఎదుర్కొంటున్నదనీ, తన తండ్రిని బికారి అంటూ అవమానించిన వారికి ఎలాగైన గట్టి బదులు ఇవ్వదలుచుకున్నాననీ, దాని కోసమే కష్టపడి చదివానని చెప్పాడు. ఇదివరకూ తమ కుటుంబాన్ని అవమానించిన వారే పొగడ్తలతో ముంచెత్తడం ఆనందంగా ఉందన్నాడు. తమ కుటుంబాన్ని అవమానించిన గ్రామంలో తానే కాబోయే మొదటి డాక్టర్ను అని తెలిపాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని తనకు పాజిటివ్గా మలుచుకోవడంతోనే ఈ విజయం సాధించానని అరవింద్ వెల్లడించాడు.