AP High Court: ఏపీలోని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను నియమించుకోవడంపై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ని నియమించడంపై దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ గా నియమితులైన నేపథ్యంలో సలహాదారుల అంశాన్ని జస్టిస్ దేవానంద్ ప్రస్తావించారు.
AP High Court: జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నలభై మంది ప్రభుత్వ సలహాదారులను నియమించుకోవడాన్ని న్యాయమూర్తి ప్రస్తావిస్తూ ఇంతమంది సలహాదారుల అవసరమా అని ప్రశ్నించారు.సలహాదారులకు హైకోర్టు న్యాయమూర్తుల కంటే అధిక సౌకర్యాలు అందుతున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.ఇంత మంది సలహాదారులను నియమించుకునే ముందు
రాష్ట్ర ఖజానా పరిస్థితులను ముఖ్యమంత్రి పరిశీలించి ఉండాల్సిందన్నారు.పైగా ప్రభుత్వ సలహాదారులు ఆ పాత్రను మర్చిపోయి మీడియా సమావేశాల్లో రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆయన ఎత్తి చూపారు.వారి పనేమిటి ..చేస్తున్నదేమిటని న్యాయమూర్తి నిలదీశారు.
కెవిపి రామచంద్రరావు ప్రస్తావన!
ఇదే సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సలహాదారుడిగా పనిచేసిన కెవిపి రామచంద్రరావు గురించి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రస్తావించారు.కెవిపి రామచందర్రావు ప్రభుత్వ సలహాదారునిగా ఉంటూ ఏనాడూ మీడియా ఎదుటకు రాలేదని న్యాయమూర్తి చెప్పారు.హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడానికే మీడియా ముందుకు కెవిపి వచ్చారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గుర్తు చేశారు.ఇప్పటి ప్రభుత్వ సలహాదారులు ఇందుకు భిన్నంగా ఉంటున్నారని కామెంట్ చేశారు
వాస్తవానికి దగ్గరగా జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యలు!
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులపై జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యలపై చర్చ ప్రారంభమైంది.ఈ సందర్భంగా న్యాయమూర్తి సరైన వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పరకాల ప్రభాకర్ ,కుటుంబరావు వంటివారు ప్రభుత్వ సలహాదారులుగా ఉంటూ రాజకీయాలు మాట్లాడే వారు.ఇప్పుడు జగన్ జమానాలో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పని చేస్తున్నారు.ఆయన మీడియా ముందుకొస్తే మాట్లాడుతున్నది రాజకీయాలే తప్ప ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ఏమీ లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ సలహాదారుల వ్యవహారశైలిపై హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగన్ ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి.