ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని విచ్చిన వార్తలు ఇటు తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఓ పత్రికలో వార్తలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ చర్చ జరుగుతుండగానే ఏపీ సర్కారు సంబంధిత కథనంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ ఎపిసోడ్ కోర్టు మెట్లు ఎక్కనుంది.
‘న్యాయదేవతపై నిఘా’ కథనంపై తాను ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని విజయవాడకు చెందిన మాజీ న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్కుమార్ వెల్లడించారు. న్యాయవ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. `ఏపీలో న్యాయవ్యవస్థపైన.. న్యాయమూర్తులపైన అధికార పార్టీ నాయకులే మాటల దాడి చేస్తున్నారు. అధికార పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారే న్యాయమూర్తులను అవమానపరిచేలా, న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం సరైనది కాదు’’ అని న్యాయవాది సంచలన కామెంట్లు చేశారు. దీంతో ఈ పరిణామం ఏ మలుపు తిరగనుందనే చర్చ జరుగుతోంది.
కాగా, దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ జరగని ‘ట్యాపింగ్’కు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని ఓ పత్రికలో కథనం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా న్యాయ వ్యవస్థపైనే నిఘా వేసినట్లు తెలుస్తోందని ఆ కథనం పేర్కొంది. ‘కోర్టులపై కుట్రలు’ లోతుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోందని తేల్చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారంతో తాము కథనం అందిస్తున్నామని పేర్కొంటూ సంచలన వివరాలు వెల్లడించింది.