కరోనా వైరస్ (కోవిడ్-19) సృష్టించిన కల్లోకం అంతాఇంతా కాదు. ఎన్నడూ తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంలో ఉండే వారిని సైతం మార్చిపడేసింది కరోనా వైరస్. మొదటి ప్రాధాన్యం ఆరోగ్యానికే అనే విధంగా అందరిలోనూ మార్పు వచ్చింది అంటే అది కరోనా వల్లనే. మరీ ముఖ్యంగా మాస్క్ లేకుండా ప్రజలేవరూ కూడా బయటకు రావడం లేదు. ఒకవేళ మాస్క్ పెట్టుకోకుండా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే లోపే ఎవరోఒకరూ ఆ విషయాన్ని గుర్తుచేస్తారు.
అంతలా మాస్కులతో నేడు బంధం కుదిరింది. అయితే, కరోనా విజృంభణకు ముందు కూడా మాస్కులు ఉన్నాయి. కానీ కోవిడ్-19 అనంతరం వీటి వాడకం పెరగడంతో పాటు రకరకాల మాస్కులు మార్కెట్ లోకి వచ్చి ప్రాచుర్యం పొందాయి. సాధారణంగా మాస్కులు అంటే ఎన్-95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, రిస్పిరేటర్స్ మాస్కులు, ఎన్ 100, ఆర్95, పీ95, పీ100 మాస్కులు గుర్తొస్తాయి. కానీ వీటీకి భిన్నంగా చాలా మాస్కులు నేడు మార్కెట్లో ఉన్నాయి. అలా కొత్తగా కనిపిస్తున్న వాటిని పెట్టుకున్నవారిని చూస్తే.. ఆశ్చర్యంతో పాటు వింతగా అనిపించినప్పటికీ.. ఎవరిపిచ్చి వారిది అనిపిస్తుంది.
అలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బంగారంతో చేసిన మాస్కు. అయితే, దీనిని మించిన ఓ మాస్కు మార్కెట్లో నేడు తెగ హల్చల్ చేస్తోంది. దాని ధర ఎంతో తెలిస్తే.. దేవుడా.. అంత ఖరీదైనదా..! అంటూ నోరెళ్లబెట్టెస్తారు. అంతలా షాక్ గురిచేసే మాస్క్ ఎంటి అనుకుంటున్నారా? దాని ప్రత్యేకత అలాంటిది మరి ! ఆ మాస్కు ధరెంతో తెలుసా? 11 కోట్ల రూపాయాలు. మీరు చదివింది నిజమే. అక్షరాల పదకొండు కోట్ల రూపాయాలు ఆ మాస్కు ఖరీదు.
అంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారా? అది మాములు మాస్కు కాదండోయ్. బంగారంతో తయారు చేసిన ఈ మాస్కులో అత్యంత విలువైన, అరుదైన వజ్రాలను పెట్టి తయారుచేశారు. ఇప్పటివరకూ చాలా మంది మాస్కును రక్షణ కోసమే కాదు స్టేటస్ సింబల్గా భావించి చాలా ఖరీదైనవే తయారు చేయించుకున్నారు. కానీ ఈ వజ్రాల మాస్కు దరిదాపుల్లోకి రాలేదు ఆ మాస్కులు. మిలమిల మెరిసిపోతున్న డైమండ్లతో కూడిన ఈ మాస్కును అత్యంత ఖరీదైన అభరణాలు తయారు చేసే ఇజ్రాయిల్కు చెందిన యెవెల్ అనే సంస్థ దీనిని తయారు చేసింది. ఇందులో నలుపు, తెలుపు రంగులో ఉండే అరుదైన, అత్యంత ప్రత్యేకమైన 3,608 డైమండ్స్, 250 గ్రాముల బంగారం ఉపయోగించారు. దీనిని అమెరికాలో ఉంటున్న ఓ చైనా వ్యాపారవేత్త ఆర్డర్ మేరకు తయారు చేసినట్టు డిజైనర్ ఐజాక్ లేవీ తెలిపారు