ఆ నిబద్ధతే వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చినట్లు ఉంది.అందుకే ఏ ఏ పదవి కైతే రాజీనామా చేశారో ఆ పదవినే ఆయనకు తిరిగి సిఎం గిఫ్టుగా ఇచ్చారు.రాజకీయాల్లో ఇలా జరగడం బాగా అరుదు.ఇక్కడ కూడా జగన్ తన విశిష్టతను చాటుకున్నారు.విషయానికొస్తే మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ టిడిపి తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఈ మధ్య వైసీపీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం టిడిపి పరంగా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.దీంతో ఆ ఖాళీని భర్తీ చేసే ఉప ఎన్నిక జరగనుండగా మళ్లీ ముఖ్యమంత్రి వైసిపి తరఫున డొక్కా మాణిక్యవరప్రసాద్ కి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 15న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 18న నోటిఫికేషన్ వచ్చింది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. జూలై 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. ఆ పదవికి ఎంపికయ్యే వారు 2023 మార్చి 29 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు.
కాగా టిడిపి పక్షాన పోటీ అభ్యర్థి లేకపోవడంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నట్టు సమాచారం.ఏదేమైనప్పటికీ వైసిపి బయట నుంచి మద్దతిస్తూ టిడిపి పరంగా లభించిన ఎమ్మెల్యే పదవులను కాపాడుకుంటున్న ముగ్గురి కంటే వరప్రసాద్ వంద రెట్లు బెటర్ అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఆయన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదులుతున్నారని ,అదే ఆయనకు మళ్లీ కొత్త అవకాశం కల్పించిందని వారు విశ్లేషిస్తున్నారు.