పోరాడితే పోయేదేమీ లేదని రుజువైంది. సంకల్పబలంతో సమిష్టి కృషితో న్యాయబద్ధమైన హక్కుల సాధనకు పిడికిలి బిగిస్తే సానుకూల ఫలితమే వస్తుందని కూడా తేలిపోయింది.బీచ్ ఫెస్టివల్లో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొత్తపట్నంలో నిర్వహించిన క్రీడా పోటీలకు వెళ్లి అధికారుల తప్పిదం వల్ల తీవ్రంగా గాయపడి అన్ని విధాలా చితికిపోయిన రాష్ట్ర కబడ్డీ క్రీడాకారిణి గూడూరి అఖిల విషయంలో ప్రభుత్వం స్పందించింది. ప్రమాదానికి గురై కాలికి బలమైన గాయం కాగా తల్లీ తండ్రీ లేని అఖిల తాత అమ్మమ్మల సంరక్షణలో చినగంజాం మండలం పెదగంజాం లో జీవచ్ఛవ౦లా బతుకుతోంది. అధికారుల పొరపాటు వల్లే ఈ ప్రమాదం జరగ్గా ఏ విధంగానూ జిల్లా అధికార యంత్రాంగం అఖిలకు సాయపడని నేపథ్యంలో ఆమె ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడింది.
ఈ తరుణంలో మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు లాయర్ జస్టీస్ ఫర్ యాక్సెస్ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ ఆమెకి అండగా నిలిచారు.ఆదివారం నాడు ఆయన పెదగంజాం వచ్చి అఖిలను పరామర్శించడమే కాకుండా ఇరవై అయిదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె పరంగా న్యాయపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు ప్రభుత్వం స్పందించని పక్షంలో తాను ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.సోమవారం అఖిలకు మద్దతుగా పెదగంజాం లో దళిత బహుజన సంఘాలు దీక్షా శిబిరాన్ని ప్రారంభించాయి.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది ప్రభుత్వం తరపున జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ,పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ రామనాధం బాబు, మాదిగ కార్పోరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు, చినగంజాం ఎం ఆర్ ఓ విజయకుమారి, ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ తరలి వచ్చి అఖిలకి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు .
అంతేగాక ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇస్తామని ,ఐఐటీ కాలేజీలో ఉద్యోగం కూడా ఇప్పిస్తామని వారు ప్రకటించారు.అవసరమైతే మెరుగైన వైద్య చికిత్స కూడా చేయిస్తామని అఖిలకు వారు హామీ ఇచ్చారు.అఖిల విషయంలో మద్దతు తెలిపి సాయపడ్డ వారికి మాదిగ సంక్షేమ పోరాట సమితి నాయకుడు సుజన్ మాదిగ కృతజ్ఞతలు చెప్పారు.వీరందరి కన్నా ముందుగా స్పందించిన జడా శ్రవణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆలస్యంగానైనా అఖిల కి న్యాయం జరిగిందని భావిస్తున్నామని ఒకవేళ ప్రభుత్వం తన మాట నిలుపుకోని పక్షంలో మళ్లీ పోరాట బాట పడతామని దళిత ప్రజా సంఘాలు ప్రకటించాయి.