Telangana : తెలంగాణ శాసనమండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును కొద్దినెలల కిందట ప్రారంభించింది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఓటర్లను చేర్పించే కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.
అయితే పార్టీ సిట్టింగ్ స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్.. బీజేపీ సిట్టింగ్ స్థానంలో మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరునే మళ్లీ ప్రకటించిన కేసీఆర్.. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిని ప్రకటించకపోవడం సరికొత్త చర్చకు దారితీసింది. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా ఇంకా ఆ స్థానంలో టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిని ప్రకటించక పోవడంతో.. ఇక్కడ పోటీకి ఆ పార్టీ ఆసక్తి చూపడం లేదన్న చర్చ సాగుతోంది.!
Telangana : హైదరాబాద్ సీటుపై టీఆర్ఎస్ కి ఆశల్లేవు!
నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం పల్లా ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుస్తున్నారు. ఇటు పార్టీ కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జిలను నియమించింది. పల్లా మరోసారి గెలవటం ఖాయమనే ధీమా గులాబీ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం విషయంలో ఈ పరిస్థితి కనిపించడం లేదని టాక్. ప్రస్తుతమిది బీజేపీకి సిట్టింగ్ సీటు. ఆ పార్టీ సీనియర్ నేత రామచందర్రావు ఈ స్థానం నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా రామచందర్ రావుకు బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వడంతో.. గత కొన్ని నెలలనుంచే ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. సామాజికవర్గం పరంగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఈసారి కూడా రామచందర్రావు గెలుపు ఖాయమని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2015లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్న సమయంలోనే ఇక్కడ పట్టభద్రులు బీజేపీకి పట్టం కట్టారు. ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ను పార్టీ తరఫున అభ్యర్థిగా రంగంలోకి దింపినా.. విజయం దక్కలేదు. దీంతో ఈసారి కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు టాక్.
ఇంటెలిజెన్స్ రిపోర్టులో కూడా ప్రతికూలతే!
మూడు జిల్లాల నుంచి రెండు మూడు దఫాలుగా అభ్యర్థి గెలుపోటములపై రహస్య నివేదికలు సేకరిస్తే ఫలితాలు తారుమారు అయ్యే పరిస్థితులు ఉన్నాయని తేలినట్టు సమాచారం. అదే సమయంలో బీజేపీ కాస్త బలం పుంజుకుందని తెలియడంతో.. అభ్యర్థిని దించడం కన్నా వామపక్షాల అభ్యర్థికి మద్దతివ్వడమే మంచిదని నిర్ణయించినట్లు సమాచారం.గెలుపోటములపై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం పార్టీకి కలిసి రాకపోవచ్చనే నివేదికలు సీఎం కేసీఆర్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించి మరో స్థానానికి పెండింగ్లో పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.