పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వివాదమే పదిహేనేళ్ల క్రితం మహారాష్ట్రలో కూడా చోటు చేసుకుంది.
అయితే విషయం బొంబాయి హైకోర్టు వరకు వెళ్లగా ఎన్నికల కమీషన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పదమూడు జిల్లాల్లో గల 2367పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధపడింది.అంతకుముందు సంభవించిన వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా వీటి ఎన్నికలు వాయిదా పడ్డాయి.అయితే ఎన్నికల కమిషన్ వీటి ఎన్నికలకి ఏర్పాట్లు చేస్తుండగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడా ఎన్నికలు పెట్టొద్దంటూ ఎన్నికల కమిషన్ ని కోరింది.అయితే ఎన్నికల సంఘం అందుకు తిరస్కరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకెక్కింది.ఆ పిటిషన్ ను విచారించిన డివిజన్ బెంచ్ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆయా పంచాయతీల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అన్ని ఆలోచించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశానుసారం ఇతర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది.2005 వ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు ,అక్టోబర్ ఇరవై మూడు తేదీల్లో ఈ ఎన్నికలు జరిగేలా నోటిఫై చేయడం జరిగింది.
అసలు ట్విస్ట్ ఇక్కడే!
ఎప్పుడైతే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. ఆగస్టు ముప్పై ఒకటి వ తేదీన ఎన్నికలు జరగనున్న 2167 పంచాయతీల తాజా మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ బోర్డులను ఏర్పాటు చేసింది.దీన్ని ఎన్నికల సంఘం వ్యతిరేకించింది.పదవీ కాలం పూర్తయిన సర్పంచులను గ్రామ అడ్మినిస్ట్రేటర్లుగా నియమిస్తే తాము స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.వారిని తొలగించి ప్రభుత్వ ఉద్యోగులను అడ్మినిస్ట్రేటర్లగా నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఇందుకు తిరస్కరించింది.పైగా లోక్సభ అసెంబ్లీల కాలపరిమితి పూర్తయినప్పటికీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పాత ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందన్న వాదనను తెరమీదకు తెచ్చింది.ఎన్నికలు జరగనున్న పంచాయితీలకు తాజా మాజీ సర్పంచుల నాయకత్వంలో అడ్మినిస్ట్రేటివ్ బోర్డులు ఏర్పాటుచేయడం కూడా ఇంతేనని ప్రభుత్వం పేర్కొంది.కానీ ఎన్నికల సంఘం మెట్టుదిగక పోయేసరికి మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ హైకోర్టు తలుపు తట్టింది.జస్టిస్ చంద్రచూడ్ ఈ ఈ పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు.ఎన్నికలు జరగనున్న తరుణంలో తాజామాజీ సర్పంచులకే అధికారాలు కట్టబెట్టడం అవాంఛనీయమన్నారు.ఇందువల్ల స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరగబోవన్న ఎన్నికల కమీషన్ వాదనతో జస్టిస్ చంద్రచూడ్ ఏకీభవిస్తూ రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమీషన్ కి ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం సహకరించాల్సిందేనని తీర్పు చెప్పారు .మహారాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ని చంద్రచూడ్ డిస్మిస్ చేశారు.
ఏపీలో ఏమవుతుందో?
ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కారణంగా చూపుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఇబ్బందవుతుందని చెబుతూ వైసిపి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతించడంలేదు.అయితే ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసేసింది.హైకోర్టు కూడా ఎన్నికల నిర్వహణను సమర్థించినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.సోమవారం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ జరుగనున్నది.తీర్పు ఎలా వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చనీయాంశం.