సాధారణంగా తొలిసారిగా ఎమ్మెల్యేలైన వారు అంతా ఆకళింపు చేసుకునే సరికి మొదటి ఐదేళ్లు పడుతుంది. మళ్లీ చాన్స్ వస్తే రెండో టెర్ము లో వారు రాజకీయ చక్రం తిప్పుతారు.
కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి గెలిచిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తొలి టెర్ములోనే ఆరిందాలుగా మారిపోయారు.వారి స్పీడుకు అవధులు లేకుండా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వీరిలో గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ, ఇదే జిల్లా తాడికొండకు చెందిన డాక్టర్ శ్రీదేవి, చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వెంకటే గౌడ, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఎమ్మెల్యే కం మంత్రి సీదిరి అప్పలరాజు, కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వంటివారు రేసు గుర్రాలు మాదిరి పరిగెడుతున్నారని వినిపిస్తోంది. వాస్తవానికి వీరు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. పైగా రాజకీయంగా పెద్ద నేపథ్యం ఏమీ లేదు.
వివిధ వృత్తుల నుంచి వచ్చి అనూహ్యంగా గత ఏడాది టికెట్ సంపాయించుకుని విజయం సాధించారు.అప్పటి నుంచే వారు రాజకీయాలను ఔపోసన పట్టారు విడదల రజనీ నియోజకవర్గంలో గట్టి పట్టు పెంచుకుంటున్నారు. ప్రత్యర్థులకు వాయిస్ లేకుండా ముందుకు సాగుతున్నారు. సొంత పార్టీలోనూ పట్టు పెంచుకున్నారు. ఇక, డాక్టర్ శ్రీదేవి.. ఢీ అంటే ఢీ అనే టైపులో రాజకీయాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆమె డాక్టర్. సౌమ్యురాలు అనుకున్నారు. కానీ, రాజకీయ అవతారం ఎత్తాక పూర్తిగా మారి పోయి మాస్ నాయకురాలిగా మారిపోయారు.
పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ కూడా తన రేంజ్లో తాను దూసుకుపోతున్నారు. మొన్న ఆ మధ్య లాక్ డౌన్ నింబంధనలని ఉల్లఘించి మరీ ఓ వంతెన ప్రారంభోత్సవం చేశారు. దీంతో ఆయనని మీడియా ఏకీపారేసింది. అయినా ఆయనేమీ వెనక్కు తగ్గలేదు .అదేవిధంగా పామర్రు ఎమ్మెల్యే అనిల్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎవరినీ లెక్కచేయడం లేదు. కొత్తకదా? అనే మాట కూడా వినిపించకుండా, కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక వీరందరినీ డాక్టర్ సీదిరి అప్పలరాజు వెనక్కు నెట్టేసి ఏకంగా మంత్రి కూడా అయిపోయారు .ఎమ్మెల్యేగా గెలిచిన యేడాదికే మంత్రి అయిన డాక్టర్ సీదిరి అప్పలరాజు పరిస్థితి కూడా ఇంతే.
ఆయన కూడా తొలిసారి విజయం సాదించారు. అయితే.. ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ అలా మాట్లాడుతూ.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్నారు.ఇలాంటి స్పీడ్ ఉన్న వాళ్ల వారి జాబితా ఇంకా చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో అనుభవజ్ఞుల ముందు కుప్పిగంతులు పనికిరావని రాజకీయ పండితులు వారిని హెచ్చరిస్తున్నారు.అతివేగం ప్రమాదకరమని వారు తెలుసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.