సైబర్ క్రైం కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా…పట్టించుకోవడం లేదు నేరగాళ్లు. సినిమాను రిలీజ్ చేయక ముందే ఆన్ లైన్లో లీక్ చేస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఇలాగే విడుదలకు చాలా రోజుల ముందే లీక్ అయింది.అయితే ఆ సినిమాలో కంటెంట్ అదిరిపోయే స్థాయిలో ఉండటంతో సినిమా ముందే లీక్ అయినా సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది.అలాగే రాజమౌళి బ్లాక్బస్టర్ మూవీ బాహుబలి ని కూడా కొందరు ఆన్లైన్లో లీక్ చేస్తామంటూ చిత్ర నిర్మాతలను బెదిరించి డబ్బు గుంజుకునే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయారు.ఇక తాజాగా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న తమిళ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ చిత్రం కూడా ఆన్లైన్లో ప్రేక్షకులకు అందుబాటులో కి వచ్చేసిందని టాక్ టాక్ .ఇక తమిళ మూవీ రాకర్స్ వంటి పైరసీ సంస్థలు సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే దాన్ని లీక్ చేస్తున్నాయి. దీంతో ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమా వాళ్లకు సైబర్ కేటుగాళ్ల ముప్పు తప్పడం లేదు.తాజాగా ఈ పరిస్థితి పాయింట్ బ్లాంక్ సినిమాకు ఎదురైంది. జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి, గడ్డం నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పాయింట్ బ్లాంక్’ సినిమా లీకైంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
విడుదల కాక ముందే లీక్ !
అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన ‘పాయింట్ బ్లాంక్’. సాయి పవన్ సంగీతం సమకూర్చగా.. పి.సి. కన్నా సినిమాటోగ్రఫీ అందించారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ సినిమాను పలు వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిత్ర దర్శకనిర్మాతలతో పాటు జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆ ప్రింట్ ను ఆన్లైన్ నుంచి తీసేయాలని పోలీసులను కోరారు.కాగా సైబర్ క్రైమ్ చట్టాలు కఠినతరంగా లేకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని టాలీవుడ్ చెబుతోంది.ఈ తరహా నేరస్థులకు కఠిన శిక్షలు విధించిన పక్షంలో వారిలో ఒక రకమైన భయం ఉంటుందని ప్రస్తుతం ఉన్న చట్టాలు ఆ విధంగా లేవని అంటున్నారు.ముఖ్యంగా వర్థమాన నటుల సినిమాలకు ఈ పరిస్థితి వస్తే వారిక ఏమాత్రం కోలుకోలేరు.