ప్రధాని మోదీని ప్రశంసిస్తూ వైసిపి నాయకుడు ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
“శాంతి సందేశం పంపిస్తున్న చైనా ! హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా డిజిటల్ స్ట్రైక్స్ మరియు దౌత్యం ద్వారా వెనక్కి నెట్టిన నరేంద్ర మోదీ గారికి దేశమంతా జేజేలు” అని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు పీవీపీ.దీంతో ఆయనపై రాజకీయ పరిశీలకుల కళ్లు పడ్డాయి.అకస్మాత్తుగా పివిపి ఎందుకని మోదీకి జై కొట్టాడన్న విషయమై విశ్లేషణలు సాగుతున్నాయి.మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పివిపి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
అయినా ఆయన పార్టీకి విధేయంగానే ఉంటూ వచ్చాడు.అయితే ఇటీవల పొట్లూరి వరప్రసాద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తన ఇంటిపై దాడి చేశారని, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పీవీపీపై ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. తన ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై పెంపుడు కుక్కులను వదిలారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.పోలీసులు ఆయనకోసం గాలిస్తున్న సమయంలో పివిపి మోదీని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం అనేది ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కేసు విషయంలో జగన్ మోహన్ రెడ్డి తనను కాపాడడ౦ లేదన్న అభిప్రాయంతో పివిపి నేరుగా ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించి బిజెపి మద్దతు పొందాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అనుకున్నారు.ఏదేమైనా ఎంపీలు గానీ ఎంపీ అభ్యర్థులు గానీ వైసీపీకి ఇబ్బందికరంగా తయారయ్యారని ఓ విశ్లేషణ సాగుతోంది.నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు ఏకంగా తిరుగుబాటు జెండాను ఎగరేయగా ఇప్పుడు పివిపి చాపకింద నీరులా రాజకీయం సాగిస్తున్నారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి