Theft in Marriage: పెళ్లి అన్నాక పంతులు, ఫోటో గ్రాఫరు, బంధువులు, విందులు, చిందులు లేకుండా చేస్తామా..!? పోనీ కరోనా కారణంగా విందులు, చిందులు ఆగినా బంధువులు, పంతులు, ఫోటోలు మాత్రం ఆగవు.. మరీ దారుణమైన పరిస్థితులు వచ్చేసి ఫోటోలు, బంధువులు ఆగినా పంతులు మాత్రం లేకపోతే పెళ్లి జరగదు.. పెళ్లి అంటే పురోహితుడు అంత ముఖ్యం.. అటువంటి ఖ్యాతి కలిగిన ఓ పురోహితుడు పెళ్లి మొత్తం చేసి.. ఆ మంగళసూత్రాన్ని చాకచక్యంగా చోరీ చేసిన ఘటన ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ లో జరిగింది.. వివరాలను పరిశీలిస్తే..
Theft in Marriage: వీడియో ఆధారంతో దొరికేసాడు..!!
మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర పడాలపల్లిలో ఈ నెల 16 వ తేదీన ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి మొత్తం అయ్యాక పిల్ల మేడలో చూస్తే పుస్తెలతాడు లేదు. ఆ గ్రామానికి చెందిన మునిరాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేంధర్ దాసు, నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతలకు పెళ్లి చేశారు. పక్కనే ఉండే గజ్వేల్ ప్రాంతానికి చెందిన పురోహితుడు వీరి వివాహం దగ్గరుండి జరిపించారు. అమ్మాయి మేడలో వేయడానికి మూడు తులాలు (సుమారు 30 గ్రాముల) బంగారు పుస్తెల తాడు చేయించారు. పెళ్లి సమయంలో పసుపుతాడు కడతాడు. ఆ తర్వాత దీన్ని మేడలో వేయాలని అక్కడే పీటలపై ఉంచారు. తీరా పెళ్లి అయిన తర్వాత బంగారు తాడుని పురోహితుడు జేబులో వేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. ఈ దృశ్యాలు మొత్తం పెళ్ళిలో తీసిన వీడియోలో రికార్డయ్యాయని వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. విషయం తెలుసుకుని పురోహితుడికి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుందని.., ఇంటికి వెళ్లినా సరిగా సమాధానం లేదని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, వీడియో పరిశీలించారు. ఆ పురోహితుడు కోసం వేట మొదలు పెట్టారు..!