అభీర్సేన్ గుప్తా దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ లేటెస్ట్ మూవీ ‘ఇందూకి జవానీ’. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు సంగీతం మికా సింగ్ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీలోని ఓ సాంగ్ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘హసీనా పాగల్ దివాని..’ అంటూ సాగే ఈ పెప్పీ సాంగ్లో కైరాతో పాటు ఆదిత్య సియల్ చిందులేసాడు. బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే ఈ గీతాన్ని రచించింది షబ్బీర్ అహ్మద్.. మికా సింగ్, ఆషీష్ కౌర్ ఈ పాటను పాడారు. అయితే ఈ పాట ట్యూన్ మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు… అనే ప్రచారం జరుగుతుంది.
ఎందుకంటే గతంలో చక్రి సంగీత దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ‘ఇడియట్’ సినిమాలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అనే ట్యూన్ను మక్కీకిమక్కీ ఈ చిత్రంలో దింపేశారని తెలుగు జనాలు ట్రోల్ చేస్తున్నారు. అయితే సంగీత దర్శకుండు మికాసింగ్ ‘హసీనా పాగల్ దివాని..’ పాటను 1998లో చేసిన తన సొంత ఆల్బమ్ ‘సాన్ మెయిన్ లాగ్ గయీ ఆగ్’ కు నుండి లీడ్ తీసుకుని.. ప్రస్తుతం న్యూ వర్షన్ గా ఈ పాటను కంపోజ్ చేశాడట. అయితే ఇదే ట్యూన్ ని స్ఫూర్తిగా తీసుకొని సంగీత దర్శకుడు చక్రి 2002 లో వచ్చిన ‘ఇడియట్’ సినిమాలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే…’ సాంగ్ ని కంపోజ్ చేశాడు.
సోషల్ మీడియా, యూట్యూబ్లు ఇప్పుడున్నంతగా ఆ సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియలేదు. అయితే ఈ విషయం తెలియని కొంతమంది ఆడియన్స్ తెలుగు సాంగ్ ట్యూన్ ని హిందీ కంపోజర్ కాపీ కొట్టాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఇడియట్ సినిమా వచ్చినప్పుడు మాత్రం ఏ ఒక్కరు కూడా ఈ పాట గురించి పెదవి విప్పలేదు. ఇప్పుడు మాత్రం ఈ సాంగ్ కాపీ అని తెగ ప్రచారం చేస్తున్నారని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారట. ఇక ఈ విషయం గనుక కియార దృష్టికి వెళ్లితే హర్ట్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే కియారా ఎంతో ఉత్సాహంతో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తే అది కాస్తా కాపీ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.