వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడాలి. ఆయన ఒకటికి పదిసార్లు ఆలోచన చేయాలి. తన పార్టీ ఎమ్మెల్యేలను ఆయన టైం ఇచ్చి కలవాలి.
వారిలో ఉన్న భావాలను పసిగట్టి భరోసా ఇవ్వాలి. లేకపోతే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన అనుకూల మీడియా పన్నాగాలకు జగన్ బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. తెరవెనుక అసలేం జరుగుతుందంటే …
వైసీపీని డైరెక్ట్ గా ఇపుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఎందుకంటే జగన్ మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా వెలిగిపోతున్నారు. పైగా ఆయనకు చెక్కుచెదరని ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక పార్టీ పటిష్టంగా ఉంది. జనాదరణకు తిరుగులేదు, అలాగే సంక్షేమ పధకాలతో జగన్ దూసుకుపోతున్నారు. మరి ఇన్ని రకాల ప్లస్ లు ఉన్న వేళ జగన్ కి ఎదురొడ్ది పోరాడడం ఢక్కా మెక్కీలు తిన్న చంద్రబాబు వల్ల కూడా సాధ్యం కావడంలేదు. దాంతో చంద్రబాబు నాటి ఎన్టీయార్ కాలం నాటి పాత ఫార్ములానే నమ్ముకున్నారా అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి.
అప్పట్లో అంటే పాతికేళ్ల క్రితం 1994 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్న గారికి బంపర్ మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ కి కేవలం 26 సీట్లు మాత్రమే దక్కాయి. మిత్రపక్షాలు అయిన వామపక్షాలతో కలుపుకుంటే నాటి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మొత్తం టీడీపీ మయంగా కనిపించేది. అయినా సరే కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ఎన్టీయార్ అధికారం కోల్పోయారు. ఎన్టీయార్ అతి విశ్వాసంతో పాటు, పార్టీలో ఎమ్మెల్యేలను అసలు కలుసుకోకపోవడం, పార్టీలో ఏం జరుగుతుందో ఏమో కనీసమాత్రంగా అంచనా వేసుకోకపోవడం, వంటి కొన్ని తప్పిదాల వల్ల రాజకీయంగాఅతి పెద్ద మూల్యమే ఎన్టీయార్ నాడు చెల్లించారు.ఈ తరహా సీనును అప్పట్లో చంద్రబాబు నాయుడు ,ఆయన అనుకూల మీడియా సృష్టించింది.అది వర్కౌట్ కూడా అయింది.
సీన్ కట్ చేస్తే ఇపుడు కూడా ఏపీ అసెంబ్లీ మొత్తం జగన్ పార్టీయే కనిపిస్తుంది. కచ్చితంగా అప్పట్లో కాంగ్రెస్ కి వచ్చిన 26 లాగానే టీడీపీకి 23 ఎమ్మెల్యేలు వున్నారు. సభలో టీడీపీకి కనీసం మాట్లాడే చాన్స్ లేదు, జగన్ కూడా ఎన్టీయార్ మాదిరిగా జనాలను నమ్ముకుంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ, కోటి ఆశలు కలిగిన ఎమ్మెల్యేలు ఉన్న పార్టీతో ఏడాది గడచింది. దీంతో ఎక్కడ నుంచి అయినా అసంతృప్తి ఉండడం సహజం. దాన్ని పెరిగి పెద్దది చేయాలని, జగన్ మీద ఎమ్మెల్యేలకు అసంత్రుప్తి దావానలంగా ఉందని చెప్పాలని చంద్రబాబు మైండ్ గేమ్ కి తెర లేపుతున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఇప్పటికే ఈ పనిలో అనుకూల మీడియా బిజీగా ఉంది. ఒక పత్రిక ప్రతి వారం రాసే తన కాలం లో జగన్ సర్కార్ మనుగడ మీద అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. మరో వైపు టీడీపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి జగన్ ఎక్కువ కాలం అధికారంలో ఉండరంటూ తరచూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో వైపు రఘురామ క్రిష్ణం రాజు ఎపిసోడ్ ఉంది. నెల్లూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి వంటి వారు మెల్లగానే మాట్లాడుతున్నా దాన్ని బూతద్దంతో చూపించే మీడియా ఒకటి ఉంది. ఇవన్నీ కలగలిపి జగన్ మీద పెద్ద ఎత్తున పార్టీలో అసంతృప్తి ఉందని ఫోకస్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతోందని అంటున్నారు.ఇదంతా 1994నాటి సీన్నే గుర్తు గుర్తు చేస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఇప్పుడు కూడా చంద్రబాబు అదే మైండ్ గేమ్ ఆడుతున్నారని జగన్ దీన్ని గమనించాల్సిన తరుణం ఆసన్నమైందని వారు హితవు పలుకుతున్నారు.