(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
ఇటు పాలనను, అటు ప్రభుత్వాన్ని సమతూకంలో నడిపించకపోతే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కొత్త సమస్యలు ఎదుర్కొనక తప్పదు. దీనికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ద పడాలి. మొన్నటి వరకు పాలనా పరమైన విషయాల్లో వచ్చిన చిక్కులతో ఇబ్బంది పడుతున్న జగన్, తాజాగా పార్టీలో జరుగుతున్న విభేదాలు రచ్చలు ఆయనకు తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రెండు చోట్ల ఆయన దెబ్బ తినక తప్పదు. పాలన విషయంలో ఎల్ వి సుబ్రహ్మణ్యం ఇష్యూ తర్వాత జగన్ తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వాటిని దాటిగా ఎదుర్కొని నిలబడ్డారు. అయితే ప్రస్తుతం పార్టీ నాయకుల్లో సఖ్యత కొరవడుతోంది. మొన్నటికి మొన్న పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న విజయసాయి రెడ్డి, అక్కడి ఎమ్మెల్యేల వివాదం రచ్చ కెక్కగా నిన్నటికి నిన్న కాకినాడలో డీఆర్సీ సమావేశం సాక్షిగా మాజీమంత్రి సుభాష్ చంద్రబోస్, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం తాజాగా పార్టీ అంతర్గత క్రమశిక్షణను బయటపెడుతున్నాయి. వీటిపై వెంటనే జగన్ దృష్టి పెట్టకపోతే పార్టీ కు అంతర్గత యుద్ధాల బాధ తప్పదు.
భాద్యుల మాట వినేదెవరు?
పార్టీపరంగా జగన్ రాష్ట్రంలోని ప్రాంతాలను విభజించి కొందరికి బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి, గోదావరి జిల్లాల బాధ్యతలు వై.వి.సుబ్బారెడ్డి కి, కృష్ణ గుంటూరు తో పాటు దక్షిణాంధ్ర బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డి కి, రాయలసీమలోని మూడు జిల్లాల బాధ్యతలు వేమిరెడ్డికి అప్పగించారు. బాధ్యతలు అప్పగించడమే గాని వారికి నిర్దిష్టమైన విధి విధానాలు ఏమీ లేవు. వీరిలో విజయసాయి రెడ్డి ఒక్కరే కాస్త యాక్టివ్గా ఉత్తరాంధ్రలో నిత్యం ఉంటూ అక్కడ నాయకులతో మమేకం అవుతున్నారు. ఏ విషయం ఉన్నా వెంటనే దానిపై దృష్టి పెడుతూ కాస్త తన పరిధిలో వ్యవహరిస్తున్నారు. మిగిలిన వై.వి.సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయా జిల్లాల బాధ్యతలు చూస్తున్న అక్కడి వ్యవహారాలను అంత సీరియస్గా తీసుకోవడం లేదు. ఆయా జిల్లా మంత్రులకే మొత్తం పెత్తనం అప్పగించారు. అక్కడున్న సీనియర్ నీ మీదే భారం వేశారు. దీంతోనే సమస్య వస్తోంది. అంతేకాదు బాధ్యతలు చూస్తున్న వారికి నిర్దిష్టమైన అధికారాలు పార్టీ తరఫున లేకపోవడంతో ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు వారి మాటే వినే పరిస్థితి లేదు. పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారు వ్యక్తిగతంగా లేదా నియోజకవర్గ పరిధిలో మాత్రమే చేసుకుంటున్నారు. అంతే తప్ప ముందుగా ఆయా జిల్లాల బాధ్యతలు చూస్తున్న పార్టీ బాధ్యతలకు ఏ విషయాలు తెలియడం లేదు.
ప్రతి జిల్లాకు పార్టీ సమస్యలు ఉన్నాయి
జగన్ ప్రతి జిల్లా మీద దృష్టి పెట్టి పార్టీ బాధ్యతలు ఒకరికి నియమిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. వారికీ నిర్దిష్టమైన బాధ్యతలు కచ్చితంగా జగన్ అప్పగించాలి దాని మీద ఆయన పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే పార్టీకి మరింత బలం ప్లస్ నాయకుల మీద అజమాయిషీ వస్తుంది. ఆయా జిల్లాల బాధ్యతలు చూస్తున్న వారికి ముందుగా అన్ని విషయాలు తెలిసేలా, ఏవైనా అభిప్రాయబేధాలు ఉంటే పరిష్కరించేలా జగన్ ఒక నిర్దిష్టమైన పార్టీ విధానం తీసుకురావాలి.
*శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చాలా సైలెంట్ గా ఉన్న, ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఆయనకు పడటం లేదు. ఒకే ఇంట్లో రెండు కుంపట్లు తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయనకు తగినంత ప్రాధాన్యం జగన్ ఇవ్వలేదు అనేది ప్రధాన ఆరోపణ. దీనిపై అప్పుడప్పుడూ ఆయన పార్టీ విధానాలు సైతం విమర్శిస్తున్నారు.
*విశాఖలో ను పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు మీద గుర్రుగా ఉన్నారు. ప్రతి విషయంలో విజయసాయిరెడ్డి ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని వారి ఆరోపణ. దీనిపై అప్పుడప్పుడు వివాదాలు రచ్చకెక్కుతున్నాయి.
* విజయనగరం బాధ్యతలు మొత్తం చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ వైఖరిపై కొన్ని ఆరోపణలు పార్టీపరంగా ఉన్నాయి. ఆయన ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి లాంటివారు ఆయనపై అప్పుడప్పుడు విమర్శలకు దిగుతున్నారు.
*తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకం. ఇక్కడ తాజాగా బోస్, ద్వారంపూడి మధ్య జరిగిన మాటల యుద్ధం తో పాటు తోట త్రిమూర్తులు పై గతంలో పెట్టిన ఓ ఫిర్యాదు సైతం పెండింగ్లో ఉంది. ఇలాంటివి తూర్పుగోదావరి లో మరి కొన్ని వివాదాలు పార్టీపరంగా ఉన్నాయి.
* పశ్చిమ గోదావరిలో పార్టీ కార్యక్రమాల్లో కొందరు ఎమ్మెల్యేలు కనీసం పాల్గొన్న లేదనేది కార్యకర్తల నుండి వస్తున్న మాట. మొత్తం వ్యవహారాన్ని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని భుజానికెత్తుకుని చేస్తున్న దానిపైన ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అందులోనూ ఇక్కడ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పార్టీ కి తల నొప్పులు ఉన్నాయి.
* కృష్ణాజిల్లా లో పార్టీ నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బీసీ అయినా సరైన ప్రాధాన్యం దక్కలేదని అప్పుడప్పుడు పార్టీ తీరు పైన ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
* గుంటూరు జిల్లాలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తీరు ప్రతిసారి వివాదాస్పదం అవుతోంది. సోషల్ మీడియాలో ప్రతిసారి వైరల్ అవుతుంది. అలాగే గుంటూరు నగరానికి సంబంధించి ఓ నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తామని ఇవ్వరన్న వ్యవహారం పెద్ద దుమారం రేపింది.
* చీరాలలో మొన్నటికి మొన్న కరణం బలరాం వర్గానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి జరిగిన గొడవ పార్టీ పెద్దల వరకు వెళ్ళింది. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సొంత పార్టీ కార్యకర్తలు లోనే కనిపిస్తుంది.
*నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ వర్గానికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గానికి జిల్లా బాధ్యతలు చూస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి వర్గానికి మధ్య విభేదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. మరోపక్క ఆనం కుటుంబానికి సరైన ప్రాతినిధ్యం లేదని వారు కినుక వహిస్తున్నారు.
*చిత్తూరు రాజకీయాల్లో పెద్దిరెడ్డి హవాను ఎవరు ఏమి అనలేరు. పార్టీ పరంగా అందరూ ఒకే తాటి మీద ఉంటారని అనుకున్నా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన మధ్య గురుశిష్యుల బంధం కాస్త చెడింది. అలాగే నగిరి ఎమ్మెల్యే రోజా సైతం పెద్ద రెడ్డి తీరు మీద ఫిర్యాదు చేసిన అధిష్టానం పట్టించుకోలేదు.
* కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విషయంలో అయోమయం నెలకొంటుంది. నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి ప్రతిసారి కల్పించుకుంటూ ఉన్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు లు అందుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఓ పంచాయతీ సైతం జరిగింది.
*కడప జిల్లాలో ఇటీవల ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల లో సొంత పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం పార్టీలోని క్రమశిక్షణను బయటపెట్టింది.
* అనంతపురం రాజకీయాలు కాస్తంత కుదురుగా ఉన్న ఎప్పుడు ఏం జరుగుతుందో సొంత పార్టీలోనే ఎప్పుడూ ఎలుకలు బయటకు వస్తాయో అంతుబట్టని స్థితి నెలకొంది.