ఉప ఎన్నికలో అధికార పక్షం ఓడిపోవటం ఆషామాషీ విషయం కాదు.ఆ ఒక్క సీటు వలన ప్రభుత్వం పడి పోకపోయినప్పటికీ ఆ ఒక్క ఎన్నికల ఫలితమే అధికార పార్టీ భవితవ్యాన్ని కూడా చెబుతుంది.
చాలాకాలం క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు 1992 వసంవత్సరంలో నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నిక జరిగింది.అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించాడు.అదే కాంగ్రెస్ పరాజయానికి తొలి సూచికగా తేలింది.1994 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లకు పరిమితమైంది. 2012 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పదహారు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరి ఉప ఎన్నికలకు వెళ్లగా పధ్నాలుగు మంది గెలిచారు.కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.ఆ తదుపరి 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. అంతెందుకు మొన్న మొన్న జరిగిన నంద్యాల ఉప ఎన్నికను కూడా ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనకందరికీ తెలుసు.
చంద్రబాబు పరివారమంతా అక్కడే మకాం వేసి నంద్యాల ఓటర్లకు అనేక తాయిలాలు పంచి మొత్తంమీద గెలిచామనిపి౦చుకున్నారు. అంటే ఉప ఎన్నికలోనే ప్రజానాడి దాదాపు అర్థమైపోతుంది. తెలంగాణాలోని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషించేందుకు ఇదంతా చెప్పాల్సి వస్తోంది.తెరాస ఆవిర్భావం తర్వాత ,కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆరేళ్లలో ఆ పార్టీ ఓడిపోయిన తొలి ఉప ఎన్నిక ఇది.నిజానికి టీఆర్ఎస్కు ఉపఎన్నికలే కలిసివస్తాయి.అలాంటిది దుబ్బాకలో మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యనే పోటీకి నిలబెట్టినా ఆ సానుభూతి ఓట్లు కూడా దక్కకుండా టీఆర్ఎస్ ఓడిపోవడం అనేది అందరూ పరిగణించాల్సిన ముఖ్యాంశం. టీఆర్ఎస్ చేతిలో అధికారం ఉంది. అంగబలం ఉంది. అర్ధబలం ఉంది.
బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి.చేతిలో న్యూస్ ఛానెల్ ఉంది, పత్రికలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా… దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది.గెలిచిన బీజేపీకి- టీఆర్ఎస్ కు ఉన్నవాటిలో 90 శాతం లేవు. అయినా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు గెలిచారు.దీనికి ప్రధాన కారణం ప్రజల ఆలోచనా విధానాల్లో వచ్చిన మార్పు. దుబ్బాక ఫలితం సారాంశమేమిటంటే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెడతారు.ఓటరు ఒక్కసారే మోసపోతాడు తప్ప అన్నిసార్లు కాదని కూడా దుబ్బాక రుజువు చేసింది!ఈ ఈ ఫలితం నుండి ఆంధ్రప్రదేశ్ లోని వైసిపి ప్రభుత్వం కూడా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.