వైసీపీలో కొందరు సీనియర్ నేతల ఆవేదన వర్ణణాతీతంగా ఉందంటున్నారు. రాజకీయాల గురించి కొంచెం అవగాహన ఉన్నవారికి కూడా సుపరిచితం అయిన సదరు నాయకులు తమ పరిస్థితి కక్కలేక మింగలేక మారిపోయింది
అన్నట్లుగా ఉందని సన్నిహితులతో వాపోతున్నారట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిని బయటకు చెప్పలేం భరించుకోలేం అనే స్థితిలో సదరు నేతలు ఉన్నారని చెప్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని రాయలసీమ వరకు చాలామంది నేతలు, ప్రజాప్రతినిధులు ఇలాంటి భావనలోనే ఉన్నారంటున్నారు.
ఏపీలో అధికార వైసీపీలోని సీనియర్, ముఖ్య నేతల జాబితాను గమనిస్తే కొందరి పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి. ధర్మాన ప్రసాదరావు, కిల్లి కృపారాణి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, శెట్టిపల్లి రఘురామ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథర్రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి, రెడ్డి శాంతి, వి.కళావతి వంటి ప్రజాప్రతినిధులు, సీనియర్ల పేర్లు వైఎస్ జగన్ పట్ల అసంతృప్తుల జాబితాలో ఉన్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి వంటి నేతలు దివంగత వైఎస్తో ఉన్న సాన్నిహిత్యం, గతంలో మంత్రి పదవులు నిర్వహించిన అనుభవంతో ఏపీ సీఎం జగన్ సర్కారులోనూ అవే పదవులు ఆశించారు. అయితే సదరు క్యాబినెట్ పోస్టులు అవి దక్కలేదు. పోనీ నామినేటెడ్ పదవులైన సీఎం వైఎస్ జగన్ ఇస్తారా అంటే ఆ మాట కూడా లేదు! నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, శెట్టిపల్లి రఘురామ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథర్రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి, రెడ్డి శాంతి, వి.కళావతి, వంటి పార్టీ కోసం ఆది నుంచి శ్రమ పడిన వైఎస్ఆర్సీపీ నేతలు తమకు తక్కిన అవకాశం, గౌరవం దక్కుతుందని భావించి నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారట. కిల్లి కృపారాణి వంటి సీనియర్ నేత సైతం ఇదే ఆశలో ఉన్నారని అంటున్నారు.
ఈ జాబితాలో ఉన్న కొందరు నేతలు గతంలో తాము చేసిన కృషి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమకు ఇచ్చిన హామీ ప్రకారం ఏపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు దక్కుతాయని నిరీక్షిస్తున్నారు. ఈ లిస్టులోని కొందరు నేతలు తమకు అవకాశః ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే, కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగడం కావచ్చు లేదా సీఎం జగన్ ఈ విషయంలో దృష్టి పెట్టకపోవడం కారణం అయి ఉండవచ్చు కానీ ఈ నేతలతో సమావేశం అవడం లేదంట. పదవి ఇవ్వడం గురించి తనను సంప్రదిస్తారని కావచ్చు లేదా సరైన సమయం రాలేదని కావచ్చు కానీ సీఎం జగన్ ఇలా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఈ ముఖ్య నేతల్లో కొందరు నారాజ్ అవుతున్నారని టాక్.