బిజెపి నేత , లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా కి క్లీన్ చిట్ లభించింది .ఆమె బ్యాక్ డోర్ ద్వారా సివిల్స్కు ఎంపికైందని…అసలు యూపీఎస్సీ పరీక్ష కూడా రాయకుండానే ఆమె సివిల్స్కి ఎంపికైందని ఆరోపిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్గా మారాయి.
తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని ఆమె అడ్డదారిలో ఐఏఎస్ కు ఎంపికయ్యారని ఆ పోస్ట్ లలో ఆరోపించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే యూపీఎస్సీలో 90 సీట్లను బ్యాక్ డోర్ ఎంట్రీ కోసం రిజర్వ్ చేశారని,కేవలం రాజకీయ పలుకుబడి కారణంగా కష్టపడి చదివే అభ్యర్థులకు బదులు ఇలాంటివాళ్లకు సివిల్స్లో స్థానం దక్కుతోందఅని ఆ పోస్టులో ఆరోపించారు.అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది.ఆమె అందరి మాదిరే యూపీఎస్సీ ప్రవేశ పరీక్షలు రాసి ఈ ఉద్యోగాన్ని తెచ్చుకుందని పేర్కొంది.
ఇదిగో హాల్ టిక్కెట్ నెంబర్ !
అంజలి బిర్లా 2019లో యూపీఎస్సీ ప్రిలిమ్స్తో పాటు,మెయిన్స్ కూడా రాసి అర్హత సాధించిందని తెలిపింది. దీనికి సంబంధించి యూపీఎస్సీ ప్రచురించిన ర్యాంకుల జాబితాను కూడా షేర్ చేసింది. ఆమె హాల్ టికెట్ నం.0851876 అందులో స్పష్టంగా కనిపిస్తోంది. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంజలి బిర్లా కూడా ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని తెలిపారు. పుకార్లు ఎప్పుడూ వినేందుకు బాగుంటాయని… కానీ ఇలాంటి అర్థం లేని,ఆధారాలు లేని విమర్శలను తానెప్పుడూ చూడలేదని అన్నారు.
యుపిఎస్సి ఎంపిక తీరే వేరు!
దేశంలో అత్యున్నత సర్వీసుల్లో చేరేందుకు యూపీఎస్సీ ఒక ప్రవేశ ద్వారం లాంటిది. ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీకి పోటీపడుతారు. వీరిలో కేవలం కొన్ని వందల మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ప్రిలిమ్స్,మెయిన్స్,ఇంటర్వ్యూ… ఇలా మూడంచెల ప్రక్రియ ద్వారా యూపీఎస్సీకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అసలు పరీక్ష రాయకుండా ఎవ్వరూ ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి యూపీఎస్సీలో ఉండదని అధికార వర్గాలు చెప్పాయి.బ్యాక్డోర్ ఎంట్రీ రాజకీయవేత్తలకు ఉందన్న ఆరోపణలను కూడా యూపీఎస్సీ వర్గాలు ఖండించాయి.ఇలాంటి నిరాధారమైన సోషల్ మీడియా పోస్టులు యూపీఎస్సీ లాంటి సంస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేవిగా ఉన్నాయని వారు వాపోయారు.