తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, సిరమామిడి గ్రామంలో నాటుసారా కలకలం రేపింది. అక్కడ నాటుసారా తాగిన 25 మంది అస్వస్థతకు గురి అవ్వగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అసలు ఏం జరిగిందంటే…
ఇటీవల సిరమామిడి గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతని అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు మరియు గ్రామస్తులు హాజరయ్యారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత వారిలో 25 మంది నాటుసారా తాగారు. నాటుసారా తాగిన కొద్దిసేపటికే వారు అందరూ అస్వస్థతకు గురవడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకరమయిన వాతావరణం నెలకొన్నది. కొందరికి వాంతులు మరికొందరు ఏకంగా కళ్లుతిరిగి కింద పడిపోయారు.
అప్రమత్తమయిన స్థానికులు వారందరిని దగ్గరలోని హరిపురం ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇద్దరు రక్తపు వాంతులు చేసుకోవడంతో వారిని మాత్రం శ్రీకాకుళంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో బాధితులు తాగిన నాటుసారా ఒడిశా నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో పోలీసులు నాటుసారా బట్టీలపై దాడులు చేయడంతో చేసేది ఏం లేక వారు ఒడిశా నుంచి అక్రమంగా ఇక్కడికి నాటుసారాను తీసుకొచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ మధ్య కాలంలో ఆంధ్రా మరియు ఒడిశా సరిహద్దుల్లో నాటుసారా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. నాటుసారా బట్టీల పై రాష్ట్రంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో వరుస దాడులు జరపడంతో ఇతర రాష్ట్రాల నుంచి నాటుసారా, మద్యం వంటి వాటిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. సిరమామిడి గ్రామానికి కూడా ఇదే విధంగా నాటుసారా సరఫరా అయినట్లు పోలీసుల విచారణలో తేలింది.