ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ రెండూ కీలక నిర్ణయాలే. సీఎం జగన్ సన్నిహితుల మాట ప్రకారం ఆ రెండు కూడా ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించినవే. కానీ…ఆ రెండింటికీ అనేకానేక అడ్డంకులు, సమస్యలు, కోర్టు కేసులు, ఇబ్బందులు.
ఆ రెండు నిర్ణయాలు మరేవో కావు. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ. మూడు రాజధానుల నిర్ణయం.
ఏపీలోని పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం, వచ్చే మూడేళ్లలో పక్కా ఇళ్లు ఏర్పాటు చేయాలనేది సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం. ఈ ఏడాది మార్చి 15వ తేదీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని అనుకున్నారు. తరువాత ఉగాది అనుకున్నారు. అదీ అవ్వలేదు, మే నెల అనుకున్నారు, కుదరలేదు. జూన్ నెల అనుకున్నారు. సాధ్యం కాలేదు. ఆగస్టు 15న అనుకున్నారు. ఆఖరికి అది కూడా వాయిదా పడిపోయింది. అంటే దాదాపుగా ఐదు నెలలుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా వాయిదా పడుతూ వస్తోంది.
ఇక మరో ముఖ్యమైన అంశం ప్రస్తుత రాజధాని అమరావతికి బదులుగా ఏపీలో 13 జిల్లాలు అభివృద్ధి చేయాలనే దిశగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం. ఖచ్చితంగా మూడు రాజధానుల నిర్మాణం జరిగి తీరుతుందని వైసీపీ వర్గాలు అనుకుంటున్నప్పటికీ, అమరావతి నుంచి రాజధాని తరలింపు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో…అనేకానేక సమస్యలు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులు పడుతున్నాయి.
ఈ పరిణామాలు గమనించిన వైసీపీ వర్గాలు ఆసక్తికర అంశాన్ని తెరమీదకు తెస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. అవన్నీ అమలు జరిగే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. కానీ ప్రతిపక్ష టీడీపీ స్వార్ధపూరితమైన ఆలోచనలతో అడ్డుకుంటోందని మండిపడుతున్నారు. టీడీపీ గతంలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుందని, వాటిని సరిదిద్దేలా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే…తమ ప్రయోజనాలు నష్టపోతాయనే, రాజకీయంగా భవిష్యత్ ఉండదనే కోణంలో అడ్డుపడుతున్నారని మండిపడుతున్నారు .అయితే ప్రజల ప్రయోజనాల కోసం చేసే ఏ పనీ ఆగదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.