Thieves Hulchul: ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ప్రజా ప్రతినిధుల విధి, కార్యకర్తలు, కార్యక్రమాలకు వచ్చిన ప్రజా ప్రతినిధులను నాయకులు, కార్యకర్తలు బొకేలు అందజేసి స్వాగతం పలుకుతుంటారు. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కార్యక్రమాలకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అయితే మంత్రుల పర్యటనలో పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ చోరాగ్రేసరులు (జేబు దొంగలు) తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించి నేతల జేబులు ఖాళీ చేశారంటే వారి విధులను వారు సక్రమంగా నిర్వహించినట్లే కదా..! శనివారం యాదాద్రి జిల్లాలో మంత్రుల పర్యటన జరగ్గా సందట్లో సడేమియా అన్నట్లు జేబు దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించి భారీ ఎత్తున నేతల డబ్బులు కాజేశారు.
వివరాల్లోకి వెళితే..యాదాద్రి జిల్లా మోత్కూరులో శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పాల్గొన్నారు. వీరు పట్టణానికి చేరుకోగానే పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలుకుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చే పనిలో నిమగ్నమైయ్యారు. ఇదే అదనుగా ప్రజా ప్రతినిధుల పక్కన పోలీసులు ఉన్నప్పటికీ డోంట్ కేర్ అన్నట్లుగా జేబు దొంగలు తమ చేతి వాటంతో నేతల జేబులను ఖాళీ చేశారు. అయితే నేతల స్వాగత కార్యక్రమాలను వీడియో తీస్తుండగా జేబు దొంగలు నేతల జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకోవడం కూడా రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మోత్కూరు జడ్ పీ టీ సీ భర్త సంతోష్ రెడ్డి జేబులో నుండి రూ.40వేలు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ జేబు నుండి రూ.37 వేలు, శౌలిగౌరారం చెందిన రైతు జేబు నుండి రూ.25వేలు, అడ్డగూడూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు అరవింద్ జేబు నుండి రూ.5వేలు జేబు దొంగలు కాజేశారు. అయితే డబ్బు పోగొట్టుకున్న వారిలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరి కొందరు మాత్రం తమ అజాగ్రత్తే కారణం అనుకుని నిమ్మకుండిపోయారు. పోలీస్ బందోబస్తు ఉన్న సమయంలోనే జేబు దొంగలు ఎటువంటి భయం లేకుండా తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇకపై నేతల పర్యటనలో జాగ్రత్తగా ఉండాలని నేతలు అనుకుంటున్నారు.