బుల్లి తెర మీద తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానన్ని సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. పలు ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రాంస్ తో ప్రేక్షకులతో పాటు సినిమా స్టార్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రదీప్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. వెండితెరకి హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్న సినిమాతో పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించి క్రేజ్ ని సంపాదించుకున్నాడు ప్రదీప్.
ఇక తను నటించిన సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. సరిగ్గా సినిమాని విడుదలకు సిద్దం చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టిగానే కరోనా కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. దాంతో ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదల ఆగిపోయింది. అయితే కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆమద్య 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
కాని ప్రదీప్ డెబ్యూ మూవీ కావడంతో ఆలస్యం అయినా థియేటర్ లోనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాని అల్లు అరవింద్, యూవి క్రియోషన్స్ కలిసి విడుదల చేయబోతుండటం విశేషం. ఇక ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట గత 6-7 నెలలుగా ట్రెండ్ అవుతూనే ఉండటం.. అందరిలో సినిమా మీద ఇంకా అంచనాలు పెంచేస్తున్నాయి.
యూట్యూబ్ లో ఈ పాట 200 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని రికార్డ్ సాధించింది. ప్రదీప్ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లోని పాట ఈ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకోవడం ఇదే ప్రథమం. ఇక ఈ పాటతో వచ్చిన ఆదాయంతో సినిమా సగం బడ్జెట్ రికవరీ అయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
యూట్యూబ్ పాటు ఇతర వీడియో స్ట్రీమింగ్ యాప్స్ మరియు ఆడియో స్ట్రీమింగ్ యాప్స్ అయిన జియో సావన్ ఇతర యాప్స్ ద్వారా కోటికి పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క పాటతో ఈ స్థాయి ఆదాయం రావడం రికార్డ్ కాకపోయినా చిన్న బడ్జెట్ సినిమా..అది కూడా కొత్త హీరో పాటకు ఈ స్థాయిలో ఆదాయం రావడం అనేది ఎంతో గొప్ప విషయం. ఈ నేపథ్యంలో థియేటర్ రైట్స్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు కూడా భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. ఆ రకంగా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ లాభం వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రదీప్ మాచిరాజు ఈ విషయం ఎప్పటీకీ మర్చిపోడని చెప్పుకుంటున్నారు.