ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అక్కడి మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెంటల్ సైనెన్స్ (ఎంఏఐడీఎస్)లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తున్న అభిషేక్ భయానా (26) గత 10 రోజుల నుంచి కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతనికి ఈ గ్యాప్లోనే రెండు సార్లు కరోనా టెస్టులు చేశారు. అయినా ఫలితాల్లో నెగెటివ్ అని వచ్చింది. అయితే గురువారం రాత్రి అతను తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతన్ని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే అతను గుండె పోటుతో చనిపోయాడు.
డాక్టర్ అభిషేక్ గత 10 రోజుల నుంచి తనకు కరోనా లక్షణాలు 100 శాతం ఉన్నాయని చెబుతూ వస్తున్నాడు. అయితే రెండు సార్లు టెస్టు చేసినా కరోనా లేదని వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే వారు ఏం కాదులే అని అతనికి ధైర్యం చెప్పారు. కానీ తనకు శ్వాస ఆడడం లేదని, తల తిరిగినట్లు ఉందని అభిషేక్ చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో తీవ్రత ఎక్కువ కావడంతో అతను గుండె ఆగి చనిపోయాడు. కోవిడ్ పేషెంట్లు చాలా మంది ప్రస్తుతం ఇలాగే చనిపోతున్నారు.
అయితే డాక్టర్ అభిషేక్కు కరోనా లక్షణాలు ఉన్నా అతనికి టెస్టులు చేస్తే నెగెటివ్ అని ఎలా వచ్చిందో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కరోనా టెస్టు పరికరాల నాణ్యతపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. గతంలో కొందరికి కరోనా లేకున్నా పాజిటివ్ అని టెస్టు పరికరాలు తేల్చాయి. ఇప్పుడేమో కరోనా ఉన్నా నెగెటివ్ అని ఫలితాలు ఇచ్చాయి. దీంతో ఆ పరికరాల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డాక్టర్ అభిషేక్ గత వారం కిందట వరకు ఆరోగ్యంగానే ఉన్నాడని, అతనికి ఎలాంటి సమస్యలు లేవని, అతను సడెన్గా ఇలా చనిపోవడం తమను ఎంతగానో కలచి వేస్తుందని అతని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది.