కరోనా ఆంక్షలను సడలిస్తుండడంతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్రమంగా ప్రజల రద్దీ కూడా పెరుగుతోంది. బహిరంగ ప్రదేశాలతోపాటు కార్యాలయాల్లోనూ జనాలు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నారు. దీంతో కోవిడ్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే దీన్ని నివారించేందుకు గాను ఆ యువ ఇంజినీర్ ఏకంగా ఓ నూతన డివైస్నే రూపొందించాడు. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ద్వారా పనిచేస్తుంది.
కేరళలోని మళప్పురంకు చెందిన మహమ్మద్ సెహిల్ అనే ఇంజినీర్ మంగళూరులోని పీఏ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో చదివాడు. హాంగ్కాంగ్లో గీపస్ ఇంటర్నేషన్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే కోవిడ్ వల్ల ప్రస్తుతం స్వదేశానికి వచ్చి కేరళలోని సొంత ఊర్లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇతను కేవలం 22 రోజుల వ్యవధిలోనే ఇన్వియా (inVIA) పేరిట ఓ నూతన డివైస్ను తయారు చేశాడు. దీన్ని బహిరంగ ప్రదేశాలతోపాటు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లో పెట్టవచ్చు. ఆయా ప్రదేశాల విస్తీర్ణం పెద్దదిగా ఉంటే ఒకటి కన్నా ఎక్కువ ఇన్వియా డివైస్లను అమర్చవచ్చు.
ఇన్వియా డివైస్లు అవి ఉన్న ప్రదేశంలోని ఉష్ణోగ్రతలను పరిశీలిస్తుంటాయి. ఎక్కువ జనాలు గుమిగూడితే అక్కడి వాతావరణం ఉష్ణోగ్రత పెరుగుతుంది కనుక అప్పుడు సోషల్ డిస్టన్స్ పాటించమని అలర్ట్ ఇస్తుంది. అలాగే అందులో ఇన్బిల్ట్ శానిటైజర్ కూడా ఉంటుంది. అందువల్ల అది ఉన్న ప్రాంతంలోని పరిసరాలు ఎప్పటికప్పుడు శానిటైజ్ అవుతాయి. దీంతో కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు అయితే.. ఆయా ప్రదేశాల్లో ఉండే వివరాలను ఇందులో నమోదు చేస్తే.. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే వెంటనే ఈ డివైస్ ద్వారా అలర్ట్ పంపించవచ్చు. దీంతో ఇతరులు అలర్ట్ అవుతారు. అలాగే ఆయా ప్రదేశాలకు వచ్చి, వెళ్లే సందర్శకుల వివరాలను కూడా నమోదు చేయవచ్చు. దీంతో ట్రాకింగ్ సులభతరం అవుతుంది. అలాగే కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు.
కాగా ఈ డివైస్కు గాను ప్రస్తుతం సెహిల్ పేటెంట్ తీసుకునే పనిలో ఉన్నాడు. అది పూర్తయితే ఈ డివైస్లు వాణిజ్యపరంగా మనకు అందుబాటులోకి వస్తాయి. ఇక దీని ధర వివరాలను అతను తెలియజేయలేదు. అయితే సెహిల్ గతంలో ఇలాంటివే పలు డివైస్లు, టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. వాటికి గాను అతను 4 పేటెంట్లను కూడా పొందాడు. అలాగే గ్లోబల్ ఇన్నొవేషన్ అవార్డును పొందాడు. అందుకు అతనికి రూ.5 లక్షల నగదు బహుమతి కూడా లభించడం విశేషం.