పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…ఏపీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత. చిత్తూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చినప్పటి నుండి జిల్లాలో చక్రం తిప్పుతున్న నాయకుడు. అలాంటి నేతకు ఇప్పుడు ఎదురుగాలి తగులుతోందని అంటున్నారు. ఏకంగా పార్టీ పెద్దలే ఆయనపై గుస్సాగా ఉన్నారని ప్రచారం జరుగుతుందని చర్చించుకుంటున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. `నాకు పదవి రాకుండా చేసింది వారే. నన్ను ఓడించడానికి కుట్రలు పన్నారు…నాపై దాడిచేశారు. నా నియోజకవర్గంలో అ పెద్దాయన అనుచరుల పెత్తనం ఏంటి?` అని రోజా గొడవకు దిగారు. ఈ విషయంలోనే వైసీపీ పెద్దలు పెద్దిరెడ్డి విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, కొద్దికాలం తర్వాత సీన్ మారిపోయినట్లు తెలుస్తోంది.
రోజా అసంతృప్తి చెందినట్లు కొందరు ఎమ్మెల్యేలు సైతం పెద్దిరెడ్డి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏకంగా పార్టీ పెద్దలకే పెద్దిరెడ్డి వైఖరి గురించి, ఒంటెద్దు పోకడల గురించి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ పెద్దలు గతంలో జరిగిన ఘటనలను, తాజాగా ఎమ్మెల్యేల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని మంత్రి పెద్దిరెడ్డికి కీలక సూచనలు చేసినట్లు సమాచారం. తన శాఖ వరకే పరిమితం కావాలని, నియోజకవర్గం మినహా ఇతర ఎమ్మెల్యేల ఇలాకాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.