తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఉద్యమకాలంలో తెరమీదకు వచ్చిన ఆయన వ్యూహాలు ప్రత్యేక రాష్ట్రంలోనూ సాగుతున్నాయి. ఈ వ్యూహాలకు ఎత్తుగలకు ప్రధానంగా బలైంది తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీలు.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కేసీఆర్కు ఇంకా చాన్స్లు ఇస్తుందంటున్నారు. ఉత్తమ్ రాజీనామాతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు కసరత్తు చేస్తుంటే కొత్త పీసీసీ ఎంపిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది.
పీసీసీపై ఢిల్లీ పెద్దాయన ఏమంటున్నారంటే…
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. కొత్త చీఫ్ వేటలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పడింది. అభిప్రాయ సేకరణ కోసం ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాగూర్ను హైదరాబాద్కు పంపిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించిన మాణికం ఠాగూర్ ఢిల్లీకి చేరుకున్నారు. కొత్త పీసీసీ చీఫ్పై సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేశారు అయితే, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవకముందు మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ చేసిన కామెంట్లు రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితికి నిదర్శనమని పలువురు అంటున్నారు.
నచ్చకపోతే సోనియాను కలవచ్చు…
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఠాగూర్ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నట్టు వివరించారు. 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామన్న ఆయన రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలను తెలుసుకున్నామని సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తానన్న మాణికం ఠాగూర్… ఈ కసరత్తు పూర్తి కావడానికి మరి కొంత సమయం పడుతుందన్నారు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. సంప్రదింపుల్లో “పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందో చెప్పాలని” నేతలను కోరాను.. అందరి అభిప్రాయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన… ఎవరికైనా పీసీసీ ఎంపిక కసరత్తుపై ఇబ్బందిగా ఉంటే నేరుగా పార్టీ అధిష్ఠానాన్ని కలవొచ్చు అని సూచించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల అనైక్యత మళ్లీ తెరమీదకు వచ్చిందంటున్నారు. ఇలాంటివే తెలంగాణ సీఎం కేసీఆర్కు వరం లాంటివని చెప్తున్నారు.