వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో క్రియాశీలంగా వ్యవహరించిన విషయంలో కూడా ఆయన విమర్శల పాలు కావాల్సి వస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ఓ కుటుంబం బలవన్మరణం పాల్పడిన ఉదంతం గురించి.
అసలేం జరిగింది
నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన చాలా బాధాకరం, ఈ ఘటన పట్ల రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలని సమాజంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తీ కోరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆ వీడియో చూసిన వెంటనే స్పందించారు. ఆ వీడియోను చూశాక.. ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ “సలాంకు భార్యాబిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి ఎవరు కారణమైనా, వారిపై తీవ్రమైన చర్య ఉండాలి“ అని చెప్పారు. తదనుగుణంగానే వెంటనే ఇద్దరు ఐపీఎస్ అధికారులతో విచారణకు ఆదేశించారు, విచారణలో స్థానిక సీఐ, హెడ్ కానిస్టేబుల్ పాత్ర ఉందని తేలిన వెంటనే, ఇద్దర్నీ సస్పెండ్ చేసి, 24 గంటల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఎంతో బాధ, ఆవేదనతో ముఖ్యమంత్రి జగన్ ఇంత వేగంగా చర్యలు తీసుకున్నారు.
టీడీపీ ఏం చేసింది ?
అయితే ఈ కేసు విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విపక్ష తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతోంది. ముఖ్యమంత్రి ఎవరిపైన అయితే చర్యలు తీసుకోమన్నారో.. వారిని తన పార్టీకి చెందిన తాజా రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వేదుర్ల రామచంద్రరావును న్యాయవాదిగా పెట్టి బెయిల్ ఇప్పించింది తెలుగుదేశం పార్టీ.
అందుకే మాటల యుద్ధం
టీడీపీ డబుల్ గేమ్ నేపథ్యంలో వైసీపీ ఘాటుగా స్పందిస్తోంది. ఒకవైపు కుట్రలు చేస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు విమర్శలు, నిరసనలకు పిలుపు ఇవ్వడాన్ని వైసీపీ తప్పుపట్టింది. రాజకీయాలు అంటే అన్నీ వదులుకుని, ఏది నోటికొస్తే అది మాట్లాడి, మానవత్వంతో స్పందించాల్సిన చావుని కూడా రాజకీయం చేసి వాటిపై పేలాలు ఏరుకోవడమేనా..? ఇదేనా రాజకీయం అనిపిస్తుందని వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతిపక్షం అంటే.. సమస్య పరిష్కారం పట్ల బాధ్యతగా ఆలోచన చేయకుండా, బురదజల్లటమే సంప్రదాయమా ? అని పేర్కొన్నారు. కాగా , సంఘటన పట్ల సీఎం జగన్ వేగంగా స్పందించిన ఇలా టార్గెట్ అవడం ఆయన బ్యాడ్ టైం కాకుంటే మరేంటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.