YS Jagan: మాట తప్పడు..మడమ తిప్పడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు సిఫార్సు తీర్మానం వెనక్కు తీసుకొని రాజకీయంగా మసకబారారని వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
ఈ విషయంలో తన చర్యను సమర్థించుకునే అవకాశాన్ని కూడా జగన్ కోల్పోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు శాసనమండలి రద్దుకు ముఖ్యమంత్రి నిర్ణయించడమే ఒక పొరపాటైతే , దాన్ని తిరిగి ఉపసంహరించుకోవటం అనేది సరిదిద్దలేని తప్పిదమనేది వారి విశ్లేషణ. రెండున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఇదొక్కటే నంటున్నారు.
YS Jagan: కాస్త వెనక్కి వెళితే…!
ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు శాసనమండలి అంటే వ్యతిరేకత లేదు.పార్టీలో ఉన్న చాలామందికి తాను అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆయన బుజ్జగించిన దాఖలాలు కూడా ఉన్నాయి.మొన్నటి ఎన్నికల్లో నూటయాభైఒక్క సీట్లతో వైసిపి అఖండ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.కానీ ఆ నాటికి శాసన మండలిలో టిడిపికి బలం ఉంది. శాసనసభలో ఎదురు లేకున్నా మండలిలో ప్రభుత్వ బిల్లులకి చుక్కెదురవుతోంది.ముఖ్యంగా జగన్ మానస పుత్రికైన మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించింది.దీంతో భగ్గుమన్న జగన్ అసలు శాసనమండలి వద్దంటూ అసెంబ్లీ చేత తీర్మానం చేయించి కేంద్రానికి పంపారు. ఇది ఢిల్లీలో పెండింగ్లో ఉంది
ఈ లోపు ఏమియిందంటే?
శాసనమండలి అనేది నిరంతరం ఉండేది కాబట్టి ఎప్పుడు ఖాళీ అయ్యే సీట్లను అప్పుడే భర్తీ చేయాల్సి ఉంటుంది.పైగా చట్టాల ప్రకారం ఎప్పుడూ శాసన మండలిలో అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది.వివిధ పద్ధతుల్లో తమ పార్టీ వారిని ఎమ్మెల్సీలు చేసుకునే సౌలభ్యం రూలింగ్ పార్టీ కి వుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లతో చతికిలపడ్డ టీడీపీకి కౌన్సిల్ లో ఒక్క స్థానాన్ని దక్కించుకునే బలం కూడా లేదు.ఆ ప్రకారమే వైసిపికి శాసనమండలిలో మెజారిటీ కూడా వచ్చేసింది.దీంతో జగన్ ప్రభుత్వం శాసనమండలి రద్దుకు తాము చేసిన సిఫార్సు తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అసెంబ్లీలో తాజాగా మరో రిజల్యూషన్ చేయించి కేంద్రానికి పంపారు.
YS Jagan: ఏ విధంగా సీఎం సమర్ధించుకుంటారు?
అయితే అప్పుడు రద్దు అన్న శాసనమండలి ఇప్పుడు ఎందుకు ముద్దు అయ్యిందో చెప్పుకోగలిగిన స్థితిలో జగన్ లేరన్నది వాస్తవం. అంతా మా ఇష్టం అని జగన్ వాదిస్తే చేసేదేమీ లేదు కానీ మళ్లీ కౌన్సిల్ అవసరం ఎందుకు వైసిపికి కలిగిందో సహేతుకంగా సీఎం చెప్పలేరన్నది నిర్వివాదాంశం.సాధారణంగా నాయకుడంటే ముందుచూపు ఉండాలి.ముఖ్యమంత్రికి ఇది మరింత అవసరం.శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నప్పుడే సీఎంకు రెండేళ్లలో వైసీపీకి కౌన్సిల్లో పూర్తి మెజారిటీ వస్తుందని తెలియదనుకోవాలా?ఏ లెక్కలూ లేకుండానే శాసనమండలి రద్దుకు ఆయన సిఫార్సు చేసారని భావించాలా? ఏదేమైనా ఇప్పుడు మెజారిటీ వచ్చాక శాసనమండలి రద్దు సిఫార్సు తీర్మానం వెనక్కు తీసుకోవటం ద్వారా జగన్ తన వైఖరిని తానే సడలించుకుని నలుగురికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.