వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కంటే రెబల్ ఎంపీగా మారిన అనంతరం నిత్యం వార్తల్లో ఉంటున్న రఘురామకృష్ణం రాజు పరిస్థితి గురించి కొత్త చర్చ మొదలైంది.
రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ ఎన్నో మలుపుల తర్వాత క్లైమాక్స్కి చేరినట్టే కనిపిస్తోంది. అయితే, అది అంతా అనుకున్నట్లుగా కాదని, నరసాపురం ఎంపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇస్తోందని అంటున్నారు.
పార్టీ వైఖరికి వ్యతిరేకంగా రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు, పార్టీ షోకాజ్ నోటీసుకు ఆయన ఇచ్చిన పొంతనలేని సమాధానం, ఆయన వ్యవహారశైలి… ఇలా అన్నింటిపై సీరియస్గా అయిన వైసీపీ అధిష్టానం చివరకు వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం కలిసింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ను కోరారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు మిథున్రెడ్డి, కృష్ణదేవరాయ, మార్గాని భరత్, నందిగం సురేష్ లోక్సభ స్పీకర్ను కలిసి రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ను కోరారు.
అయితే, ఈ ఎపిసోడ్ తర్వాత రెండు కీలక పరిణామాలు ఒకటి. వైసీపీ ఆయన్ను వదిలేసింది. రఘురామరాజు విషయంలో స్పందించడంపై లైట్ తీసుకుంది. ఆయన ఎంత ఆగ్రహించినా, సంచలన కామెంట్లు చేసినా లైట్ తీసుకుంటోంది. మరోవైపు రఘురామ కృష్ణం రాజు మాత్రం తన అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలోని పరిణామాలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేస్తున్నారని ఆరోపించిన రఘురామకృష్ణంరాజు… ఆ పోస్టులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో కోరారు. లేని పక్షంలో ఇలాంటి చర్యలకు ప్రభుత్వం, ఛీఫ్ సెక్రటరీ కార్యాలయం మద్దతు ఉందని భావించి, ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని లేఖలో పేర్కొన్నారు. కాగా, రఘురామ రాజు ఇప్పుడు వైసీపీ నేతల కామెంట్లకు స్పందించడం కాకుండా, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేలా, రోజూ మీడియాలో కనపడే స్థాయికి మాత్రమే వైసీపీ పరిమితం చేసేసిందనే చర్చ జరుగుతోంది.