Chandrababu Naidu: నిన్నటి వరకు టిడిపికి అండగా ఉన్న శాసనమండలిలో శుక్రవారం ఆ పార్టీ బలం దారుణంగా పడిపోయింది. వైసీపీ మెజారిటీ సాధించింది.ఇది చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్న అంశమని టిడిపి వర్గాలే చెబుతున్నాయి.
రెండేళ్లు కౌన్సిల్లో టిడిపి ఆడిందే ఆట!
2019 శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసిపి శాసనసభలో టిడిపిని కుదేలు చేసింది.అసెంబ్లీలో 151 మంది సభ్యులతో వైసిపి అత్యధిక బలంతో ఉండగా టీడీపీకి కేవలం 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.మొన్నటి ఎన్నికల్లో 23 మంది టిడిపి ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ,వారిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం ,వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి చాలాకాలం క్రితమే జగన్ పార్టీకి జై కొట్టారు.మిగిలిన పందొమ్మిదిమందితోనే శాసనసభలో ఏదోవిధంగా నెట్టుకొస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గుడ్డిలో మెల్ల మాదిరి ఇప్పటి వరకు తమకు బలమున్న శాసనమండలి ఉందనే ధీమా ఉండేది. వైసిపి అధికారం చేపట్టే నాటికి శాసనమండలిలో ఆ పార్టీకి పదకొండు మంది సభ్యులు ఉండగా టిడిపికి ఇరవై ఎనిమిది మంది సభ్యులుండేవారు. పైగా శాసనమండలి చైర్మన్ షరీఫ్, వైస్ చైర్మన్ రెడ్డి సత్యనారాయణ కూడా టిడిపి వారే కావడంతో అనేక సందర్భాల్లో అక్కడ జగన్ ప్రభుత్వం ఇబ్బంది పడింది.ముఖ్యంగా జగన్ మానస పుత్రిక అయిన మూడు రాజధానుల బిల్లు విషయంలో శాసనమండలి సర్కారుకు ఎదురు తిరగడంతో సీఎంకు పట్టలేని కోపం వచ్చింది.ఆ ఆవేశంలో శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో ఆయన ఏకగ్రీవ తీర్మానం కూడా చేయించేశారు.ప్రస్తుతం శాసనమండలి రద్దు తీర్మానం ఢిల్లీలో పెండింగులో ఉంది.
ఇక నుంచి వైసిపి పాడిందే పాట!
కాని శాసనమండలిలో కూడా సంఖ్యాబలాలు మారిపోయాయి.ఒక్క జూన్ నెలలోనే తెలుగుదేశం పార్టీ పధ్నాలుగు మంది ఎమ్మెల్సీలను కోల్పోయింది. టిడిపికి చెందిన గవర్నర్ నామినేటెడ్ కోటాలో నామినేట్ అయిన నలుగురు,స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి ఎన్నికైన పది మంది ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కావడంతో వారంతా రిటైర్ అయ్యారు.ఒక్క శుక్రవారం నాడే పదిమంది టిడిపి ఎమ్మెల్సీలు మాజీలైపోయారు.మూడు రోజుల క్రితమే నలుగురు వైసిపి నేతలు గవర్నర్ కోటాలో నామినెటెడ్ ఎమ్మెల్సీలుగా నియామకం పొందారు.తాజా బలాబలాలను చూస్తే 58 మంది సభ్యులు ఉండే శాసనమండలిలో ఇప్పుడు వైసీపీకి 21 మంది సభ్యులు ఉండగా టీడీపీ బలం పదకొండు కు పడిపోయింది.దీంతో ఇక కౌన్సిల్లో కూడా వైసిపి ఒంటి చేత్తో చక్రం తప్పబోతోంది.
టిడిపికి ఈ పరిస్థితి ఇదే మొదటిసారి!
తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అనేకసార్లు ఓడిపోయినప్పటికీ ఇంత ఘోరమైన పరాజయం మాత్రం ఎప్పుడూ ఎదురు కాలేదు.2009 అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై నాలుగు సీట్లు గెలుచుకున్న టీడీపీ ఒకటిరెండు శాసనమండలి సభ్యత్వాలను కూడా దక్కించుకుంది.కానీ ఈ పర్యాయం టిడిపి కి అసెంబ్లీలో ఉన్న బలంతో ఒక్క శాసనమండలి సీటు కూడా ఆ పార్టీ కి దక్కే అవకాశమే లేదు.పైగా శాసనమండలిలో కాస్త బాగా మాట్లాడుతారనే పేరున్న బుద్దా వెంకన్న, వైవిబీ రాజేంద్రప్రసాద్ తదితరులు కూడా రిటైర్ అయిపోయారు.కాబట్టి శాసనమండలిలో మిగిలిన నారా లోకేష్ ఇకపై వైసిపికి టార్గెట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.