రాజకీయాల్లో ఎదుటి వారికి మేలు చేసే పని సొంత వారే చేస్తుంటారా? పైగా పెద్ద ఎత్తున ఎత్తులు – పైఎత్తులు జరుగుతున్న సమయంలో… ఎవరైనా సొంత వారికే నష్టం చేసే పని చేస్తారా? నిజానికి అలా జరగదు.
కానీ ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోందని అంటున్నారు. అధికార వైఎస్ఆర్సీపీకి మేలు చేసేందుకు కృషి చేయాల్సిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ నేతలకు, వారి సానుభూతిపరులకు సహాయం చేస్తున్నారని అంటున్నారు. ఇంతకీ ఎందుకంటారా? వారి వారి లాభం కోసం.
జగన్ కోసం కష్టపడి….
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషి, పదేళ్ల పోరాటం ఫలితంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పోరాటంలో ఎందరో తమ వంతు పాత్ర పోషించారు. పార్టీ కోసం శ్రమించారు. ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టుకున్నారు. సహజంగానే వీరు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు జరిగే వాటి గురించి ఆలోచిస్తుంటారు. ఆ మాటకొస్తే ఏ పార్టీ నేతలైనా అదే ఆలోచిస్తారు. అధికారంలోకి వచ్చిన పార్టీ సైతం అదే విధంగా న్యాయం చేస్తుంది కూడా కానీ ఏపీలో మాత్రం సీన్ మారిపోతోంది అని చెప్తున్నారు.
ఎక్కడ తేడా వస్తోందంటే…
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి – సంక్షేమం ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. నిధుల సమస్య ఎదురైనా వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సహజంగానే పలు కాంట్రాక్టులు తెరమీదకు వస్తాయి. అయితే, వీటిని సొంతం చేసుకోవాల్సిన వైసీపీ నేతలకు బదులుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ చాన్స్ దక్కుతోందట. అలా ఇస్తోంది కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అని టాక్.
ఎందుకిలా చేస్తున్నారు?
కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు, సానుభూతిపరులను కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు, వారికి మద్దతు పలికే వారికి కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక లెక్క ఏంటంటే… కమీషన్లు అంటున్నారు. వైసీపీ నేతలకు సదరు పనులు అప్పజెప్తే తమకు ఏమీ దక్కదని, ఒకవేళ ఏమైనా సొతమైనా అది నామమాత్రంగానే ఉంటుందనేది వైసీపీ ఎమ్మెల్యేల లెక్క అని అంటున్నారు. సొంత పార్టీ నేతలకు బదులుగా టీడీపీ సానుభూతిపరులకు ఈ చాన్స్ ఇస్తే, కాస్త కమీషన్ ఎక్కువగా వస్తుంది, డబ్బులు కూడా సొంతం అవుతాయని సదరు ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే తమ వారిని కాదని పచ్చ పార్టీ నేతలకు చాన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు.
బాబుకు మేలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే
కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ తరహా పనుల వల్ల సహజంగానే పార్టీ నేతల్లో, సానుభూతిపరుల్లో, కాంట్రాక్టర్లలో అసంతృప్తి వ్యక్తం అవుతోందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా మారుతోందని విశ్లేషిస్తున్నారు. మరి సదరు వైసీపీ ఎమ్మెల్యే విషయంలో అధికార పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.