వివిధ వర్గాల్లో చర్చ జరిగినట్లే, పలువురి అంచనాలు నిజం చేస్తూ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రతి రౌండ్కు ఉత్కంఠ పెంచేలా సాగిన ఈ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు.
ఈ గెలుపు నేపథ్యంలో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెడుతుందా? అనే చర్చ సహజంగానే జరుగుతుంది. దాన్ని నిజం చేసేలా బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.
గెలుపులో ఎన్ని మలుపులో…
ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి కూడా వచ్చింది. ముందుగా సర్వేలు చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది. దుబ్బాకలో బీజేపీ 1118 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది.
రఘునందన్ రావు నోట…
దుబ్బాక ఉప ఎన్నికల విజయం సాధించి బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.దుబ్బాక ఉప ఎన్నిక సీఎం కేసీఆర్కు గుణపాఠమని ఫైర్ అయ్యారు. ఈ సౌండ్ వినాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాని రఘునందన్ రావు పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దుబ్బాకలో బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన ఆయన ఈ చారిత్రక తీర్పు పాలకులకు కనువిప్పు కావాలని అన్నారు. దుబ్బాక విజయానికి సహకరించిన కార్యకర్తలకు, నేతలకు ఈ సందర్భంగా రఘునందన్ రావు కృతజ్ఙతలు చెప్పారు.
బండి సంజయ్ మాట విన్నారా?
దుబ్బాక విజయం తెలంగాణ ప్రజలందరీ విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బీజేపీ గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యతిరేకత అని స్పష్టం చేశారు. దుబ్బాక ప్రజల్లో నిజాయితీ ఉందని.. ఇదే స్ఫూర్తితో గోల్కొండ కోటపైనే బీజేపీ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రామరాజ్య స్థాపనకు మలిదశ ఉద్యమమని పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?