చరిత్రలో కొన్ని అమూల్యమైన వస్తువుల స్థానం ఎప్పటికి పదిలంగా ఉంటుంది. భారతదేశానికి సంబంధించినంత వరకు అటువంటి గొప్ప విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది కోహినూర్ వజ్రమే. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కోహినూర్ డైమండ్ జన్మస్థలం భారతదేశం అయినప్పటికీ ఇక్కడి రాజుల అంతర్గత కలహాల వల్ల ఆ వజ్రం దేశాలు దాటిపోయింది. అలా చివరికి ఈ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో పొదుగుతోంది. ప్రస్తుతం ఈ వజ్రానికి విలువ కట్టడం ప్రపంచంలో ఎవరి తరం కాదు.
కోహినూర్ వజ్రం మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరుగనుల్లో లభించినట్లు పురావస్తు శాఖ వారు చెబుతున్నారు. ఈ వజ్రం 105 క్యారట్లు కలిగిఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రమని చెబుతుంటారు. ఈ వజ్రాన్ని 1877 వ సంవత్సరంలో హిందూ దేశ మహారాణిగా విక్టోరియా మహారాణి పట్టాభిషక్తురాలు అయినప్పుడు ఆమె కిరీటంలో పొందుపరిచారట.
అయితే అప్పటిలో ఈ వజ్రంను మగవాళ్లు ధరిస్తే సర్వనాశనం అయిపోతారని అలాగే స్త్రీలు ధరిస్తే బాగా అభివృద్ధి చెందుతారని అనేవారట. అందుకే ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ బ్రిటన్ రాణి మాత్రం ఈ వజ్రాన్ని వదిలిపెడ్డం లేదట. అయితే, కోహినూర్ అనే పదానికి కోహ్ – ఇ- నూర్ అంటే ‘కాంతి శిఖరం’ అని అర్ధమట. ఈ వజ్రానికి ఈ పేరు ఒక ముసలమన్ రాజు పెట్టారట.
ఈ వజ్రాన్ని మొదటిగా దక్కించుకున్న వ్యక్తి మాల్వా రాజు మహలక్ దేవ్. కాలాంతరంలో చివరికి ఈ వజ్రంను బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడట. అయితే ఈ వజ్రం తమకు తిరిగి ఇచ్చేయాలని మన దేశం ఇప్పటికే ఎన్నోసార్లు బ్రిటన్ ను అభ్యర్థించింది. కానీ బ్రిటన్ నుంచి ఎప్పుడూ సానుకూల స్పందన రాలేదు.