ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఓ వైపు రాజకీయ విమర్శల పరంపర కొనసాగుతుండగా మరోవైపు ఇంకో కోణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని టాక్ తెరమీదకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, ఇప్పుడు ఆయన ముందు ఏకైక ఆప్షన్ ఆదాయం సమకూర్చుకోవడంపైనే ఉందని అంటున్నారు.
ఇన్ని చేస్తున్నప్పటికీ….
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి హామీని అమలు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఇచ్చిన హామీలే కాకుండా, కొత్త పథకాల అమలును సైతం ఆయన విజయవంతంగా చేస్తున్నారు. అయితే, ఈ సమయంలో ఆయనకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇటు పెద్ద ఎత్తున పథకాల అమలుతో నిధుల ఖర్చు, మరోవైపు కరోనా సమయంలో ఆదాయం పడిపోవడం, ఇంకో వైపు కేంద్ర నిధులు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్థిక కష్టాలు ఎదుర్కుంటున్నారని అంటున్నారు.
అసలు సమస్య ఇదే
మాట తప్పను మడమ తిప్పను అనే మాటతో అధికారం కైవసం చేసుకున్న జగన్ ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన ముందున్న సమస్య భవిష్యత్తులో ఇదే నిబద్దత కనబర్చడం అని అంటున్నారు. ఇచ్చిన హామీల అమలు చేయడం కోసం ఖచ్చితంగా నిధుల సమస్య ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో సర్కారుకు ఆదాయం వచ్చే మార్గాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం. పాలకులకు ఆదాయం తెచ్చిపెట్టే వాటిల్లో మద్యం ముందు ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏపీలో మాత్రం సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు సాగుతున్నాయి. దీంతో జగన్ ఏ రూపంలో నిధులు సమకూర్చుకుంటారు? రాబోయే కాలంలో హామీల అమలు సంగతి ఏంటి? కేంద్రం దగ్గర నుంచి ఎలా నిధులు రాబడుతారు? అనేది అనే ప్రశ్న తెరమీదకు వస్తోంది.
కేంద్రం నిధుల కోసం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, ప్రస్తుతం కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రూ.3,805 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడానికి సహకరించాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదల ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నందున నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. కాబట్టి ఈ ప్రక్రియను సులభతరం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి తన లేఖలో ప్రధానమంత్రిని కోరారు. ఈ విషయాలను రాజ్యసభలో విజయసాయి రెడ్డి తాజాగా మరోమారు వెల్లడించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?