ఈఎస్ ఐ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అచ్చెన్నను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అచ్చెన్నాయుడు 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు (మంగళవారం) అచ్చెన్నకు చాలా కీలకం కాబోతోంది. ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి… అక్కడ అచ్చెన్న లేకపోవడం టీడీపీ కచ్చితంగా పెద్ద లోటే! చంద్రబాబే లీడ్ చేయాల్సి వస్తోంది.. రామానాయుడు నుంచి కాస్త సపోర్ట్ దొరుకుతుంది.. పయ్యావుల కేశవ్ నుంచి ఇంకాస్త! ఈ సమయంలో అసెంబ్లీలో అచ్చెన్న ఉంటేనా అని ఇప్పటికీ టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… ఇప్పుడు అచ్చెన్నకు బెయిల్ దొరుకుతుందా లేక ఏసీబీ అధికారులు కోరుతున్నట్లు కస్టడీకి పంపుతారా అనేది చాలా కీలకంగా మారింది.
అచ్చెన్నాతో మంచీ చెడూ మాట్లాడుకునే పరిస్థితి ప్రస్తుతం టీడీపీ అధినేతకు లేదు. ఆ సమయంలో అచ్చెన్నకు బెయిల్ దొరికితే పరిణామాలు చాలా మారిపోతాయని రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తుంది. దీంతో… ఈఎస్ ఐ స్కాం విషయంలో తనను ఉద్దేశ్యపూర్వకంగానే ఇరికించారని అచ్చెన్నాయుడు అవినీతినిరోదకశాఖ (ఏసీబీ) కోర్టులో తెలిపారు. శాసనసభపక్ష ఉపనేతగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నందుకే తనపై కేసుపెట్టారని.. కాబట్టి ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన లాయర్లు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వారి కోరిక అలా ఉంటే… ఈ విషయంలో అచ్చెన్నాయుడిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ లను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై మంగళవారం విచారణ జరగనుంది. దీంతో… అచ్చెన్నాకు బెయిలా కస్టడీనా అనే టెన్షన్ లో ఉన్నాయి టీడీపీ శ్రేణులు. ఏది ఏమైనా… తాను లేని అసెంబ్లీ.. తాను ఉన్న రిమాండ్.. అధికారులు కోరుతున్న కస్టడీ.. తాను కోరుతున్న బెయిల్… అచ్చెన్నకు ఈ మంగళవారం చాలా ప్రత్యేకమనే చెప్పాలి!!