పిచ్చి పలు విధాలు.. అని పెద్దలు ఊరికే అనలేదు. అది కొంత మందికి గురివింద గింజంత ఉంటుంది. కొందరికి వెలగపండు అంత ఉంటుంది. ఇక పైత్యం తలకెక్కిన కొందరికి అయితే పిచ్చి గుమ్మడికాయ సైజులో ఉంటుంది. అవును.. సరిగ్గా ఇలాంటి వారే బుద్ధి లేని పనులు చేస్తుంటారు. అమెరికాలోని అలబామా సిటీలో ఉన్న పలువురు విద్యార్థులు కూడా ఈ విధంగానే వెర్రిగా ప్రవర్తించారు. కరోనా పేషెంట్లతో పార్టీలు చేసుకోవడమే కాదు.. ఎవరికి ముందుగా కరోనా సోకుతుందోనని ఏకంగా బెట్టింగ్లే వేసుకున్నారు.
అలబామా సిటీలో ఉన్న టుస్కాలూసా సిటీలో యూనివర్సిటీ ఆఫ్ అలబామాతోపాటు పలు కాలేజీలు ఉన్నాయి. అక్కడ అనేక వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వారు తాజాగా కోవిడ్ పేషెంట్లతో పార్టీలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లను పార్టీలకు పిలిచి వారితో రాసుకు పూసుకు తిరగాలి. ఈ క్రమంలో ముందుగా కరోనా వచ్చిన వారికి బెట్టింగ్ వేసిన సొమ్మును అందజేస్తారు. అందుకు గాను పార్టీకి హాజరైన వారు ఒక పాట్లో తమ బెట్టింగ్ సొమ్మును ఉంచాలి. అయితే ఈ విషయం అక్కడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో టుస్కాలూసా సిటీ కౌన్సిల్ మెంబర్లు అలర్ట్ అయ్యారు.
విద్యార్థులు ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారు, కోవిడ్ పేషెంట్లు ఎవరెవరు ఆ పార్టీలకు హాజరయ్యారు, ఏయే విద్యార్థులు ఆ పార్టీలకు వెళ్లారు.. అనే వివరాలను అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని వారు చెబుతున్నారు. పౌరులు విధిగా మాస్కులను ధరించాలని, కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని ఇప్పటికే అక్కడ నిబంధనలు ఉన్నా.. ఆ విద్యార్థులు మాత్రం పైత్యం తలకెక్కి ఇలా వెర్రిగా పార్టీలు నిర్వహించడం స్థానికుల్లో భయాందోళనలను కలిగిస్తోంది.