SP Balasubramanyam : (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే ఈ ప్రపంచంలో తెలియని వారుండరు. ఆయన పాటకి పల్లవి ప్రాణం పోశారు. అందుకే పాటకి బాలూ ప్రాణం అని నేడు సువర్ణాక్షరాలతో లిఖించబడిన మాట. పాటని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే ఎంతో ప్రాణంగా చూస్తారు. బాలు ఒక సంగీత సైనికుడని.. ఆ సంగీత లోకంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను మైమరపింప చేశారని ప్రముఖు నేడు చెప్పుకుంటున్నారు. బాలు తన మొదటి పాట శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో పాడారు.
మొదటి పాటే బాలుకి ఎంతో గుర్తింపును తెచ్చింది. ఆ రోజు నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకు అలుపెరగని బాటసారిగా ప్రపంచ దేశాలలో తన మధుర గాత్రాన్ని అందించారు. ఇండస్ట్రీకొచ్చిన మొదట్లో తెలుగు, తమిళ సినిమాలలో మాత్రమే పాటలు పాడారు. ఆ తర్వాత సౌత్ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ తో పాటు హిందీ లాంటి జాతీయ భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడి ప్రతీ ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. బాలు నేపథ్య గాయకుడుగానే కాకుండా, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, వ్యాఖ్యాతగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
బాలు పాటకి కోట్లతో వెల కట్టలేని విలువుంటుంది అంటే కాదనేవారుండరేమో. ఆయన పాట విలువ తెలుసుకున్న సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలలోని ప్రముఖ సంగీత దర్శకులు, దర్శక నిర్మాతలు, హీరోలు .. బాలుతో ఒక్క పాటైనా పాడించుకోవాలని ఎంతగానో ఆరటపడేవారు. అది తెలుసుకున్న బాలు అడిగిన వారికి కాదనకుండా పాడిన గొప్ప గాయకులు. ముఖ్యంగా హీరోలకి, వారి హావా భావాలకు, వారి గాత్రానికి అతి దగ్గరగా పాడగల ఒకే ఒక్క గాయకులు ఎస్పిబీ మాత్రమే. విశ్వనటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇలా స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోలందరికి డబ్బింగ్ చెప్పారు.
లెజండరీ సంగీత దర్శకులు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా – బాలుల మధ్య ఉన్న బంధానికి ఏ ఒక్కరు వెల కట్టలేరు. ఇళయరాజాతోనే కాదు హీరోలు..ఆయనతో పాటలు పాడిన సహ గాయనీ, గాయకులకు ఇన్సిపిరేషన్, రోల్ మోడల్, మార్గదర్శి. నవతరానికి ఆయనొక దిక్సూచి. ఇప్పటి గాయనీ గాయకులలో క్రమ శిక్షణ లోపించిందనే మాట బాగా వినిపిస్తోంది. కానీ నాటి నుంచి ఆయన చివరి శ్వాస వరకు ఒక్కసారి పాట పాడతాను.. అని మాటిస్తే ఆ పాట పూర్తి చేసే వరకు వేరే ధ్యాసే ఉండదు.
భాషతో సంబంధం లేకుండా బాలు పాడిన ప్రతీ పాట ఓ ఆణిముత్యం. రక్తి గీతం, భక్తి గీతం..ఇలా ఏది పాడాలన్నా బాలు ఒక్కడికే సాధ్యం అని చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా పాటలు మాత్రమే కాదు భక్తి పాటలు కొన్ని వందలు పాడిన ఘనత బాలు సొంతం. బాలు 50 ఏళ్ల సినీ ప్రయాణంలో గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా 29 నంది అవార్డులు, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆంధ్రులు మరచిపోలేనివి ఎన్నో ఉన్నాయి. వాటిలో రెండు నన్నయ్య కలం, బాలు గళం.