BJP : అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం ఇవ్వలేదని తనను కొందరు బెదిరిస్తున్నారని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి చెప్పారు. ఒక మహిళతోపాటు ముగ్గురు పురుషులు తన ఇంటికి వచ్చారని, రామాయల నిర్మాణానికి డబ్బులు ఇవ్వన౦దుకు బెదిరించారని తెలిపారు. ఎవరు సమాచారం ఇస్తున్నారు? అసలు నిజాయితీ ఉందా? కొందరు ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. నేను కూడా ఓ బాధితుడినే. ఒక మహిళ, ముగ్గురు పురుషులు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించారు. నేనెందుకు డబ్బులు ఇవ్వట్లేదని అడిగారు. విశ్వ హిందూ పరిషత్ను ఒక్కటే కోరుతున్నా.. డొనేషన్స్ వసూలు చేసే వాళ్లు నిజాయితీగా ఉండేలా చూడండి’ అని కుమారస్వామి పేర్కొన్నారు.
BJP : రాముడి పేరుతో వసూళ్లు:మహారాష్ట్ర సీఎం
రామమందిరం నిర్మాణం పేరుతో మోసపూరితంగా కొందరు వసూళ్లు కొనసాగిస్తున్నారని, అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని శివసేన కార్యకర్తలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచించారు. మంగళవారం ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ అయోధ్య రామమందిరం పేరుతో జరుగుతున్న వసూళ్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాముడి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కొంత మంది రాముడి పేరుతో మోసపూరితంగా చందాలు సేకరిస్తున్నారు, డబ్బులు పోగు చేస్తున్నారు. ఇలాంటి వారి బారిన ప్రజలు పడకుండా శివసేన పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా వ్యహరించాలి. ప్రజలకు అవగాహన కల్పించి, మోసాలకు బలికాకుండా చూసుకోవాలి’’ అని అన్నారు. వాస్తవానికి ఆయన విమర్శలు ఎక్కుపెట్టింది భారతీయ జనతా పార్టీపైనే అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ పార్టీనే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చందాలు వసూలు చేస్తోంది. కాకపోతే తన ప్రసంగంలో ఎక్కడా ఆ పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు.
వెండి ఇటుకలు ఇక చాలు!
ఇదిలా ఉండగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వెండి ఇటుకలు ఎవరూ పంపవద్దని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. భక్తులు బహూకరించిన వెండి ఇటుకలను భద్రపరచడానికి బ్యాంకు లాకర్లలో స్థలం లేదని, అందుకే ఎవరూ వెండి ఇటుకలను సమర్పించవద్దని కోరింది. ఇప్పటి వరకు 400 కిలోగ్రాముల వెండి ఇటుకలను భక్తులు సమర్పించారని ట్రస్ట్ పేర్కొంది. ‘‘రామ మందిర నిర్మాణానికి దేశంలో అనేక మంది భక్తులు వెండి ఇటుకలను బహూకరిస్తున్నారు. మరికొన్ని కూడా వస్తున్నాయి. అయితే వాటిని ఎలా భద్రపరచాలన్న విషయంలో ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి ఎవరూ వెండి ఇటుకలను బహూకరించవద్దు. బ్యాంక్ లాకర్లన్నీ నిండిపోయాయి.’’ అని ట్రస్ట్ ప్రకటించింది. అయితే భక్తుల మనోభావాలను తాము అత్యంత శ్రద్ధతో అర్థం చేసుకుంటామని, అయినా సరే… భక్తులెవరూ వెండి ఇటుకలను బహూకరించవద్దని కోరింది.