వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసి) ఆధ్వర్యంలో విద్యార్ధుల ర్యాలీలు, సదస్సులు కొనసాగుతున్నాయి. అనకాలపల్లి జిల్లా చోడవరంలో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు లజపతిరాయ్, దేవుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది విద్యార్ధులు పాల్గొనగా, వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హజరై ప్రసంగించారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ, తోక పార్టీలు పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
మన విశాఖ .. మన రాజధాని పేరుతో శ్రీకాకుళం లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తే చంద్రబాబు దానిని విస్మరించారని ధర్మాన అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు మంచి రాజధాని అవసరం ఏర్పడిందన్నారు. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి రెండేళ్లకే ఖాళీ చేశారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధమని చెప్పారు. పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని కోసం 3,500 రహస్య జీవోలు ఇచ్చారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్రం నియమించిన కమిటీయే చెప్పిందన్నారు. ఆంధ్ర రాజకీయ పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చిందని చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో హైకోర్టు ఉండగా, భూవనేశ్వర్ పరిపాలన రాజధానిగా ఉందని గుర్తు చేస్తూ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోందని తెలిపారు. అభివృద్ధి అసమానత ఉంటే రాష్ట్రంలో అస్థిరత ఏర్పడుతుందన్నారు. అందుకే జగన్మోహనరెడ్డి ముందు చూపుతో ఆలోచన చేసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, దీన్ని రాష్ట్రంలోని ప్రజలు అందరూ మద్దతు ఇస్తున్నారని అన్నారు.
Hawala Cash: జూబ్లిహిల్స్ లో భారీ ఎత్తున హవాలా నగదు స్వాధీనం