(చెన్నై నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఓ వ్యక్తి రివాల్వర్తో వస్తాడు. కాల్పులు జరుపుతాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. కొద్దిసేపటికే మృతి చెందుతారు. ఇటువంటి సంఘటనలు క్రైమ్ సినిమాల్లో మనం అందరం చూస్తుంటాం. అదే ఇటీవల కాలంలో అమెరికాలో ఇటువంటి తరహా నేరాలు అధికంగా జరుగుతున్నాయనేది మనకు తెలుసు. కానీ తమళనాడు రాజధాని చెన్నైలో ఇటువంటి సంఘటన ఒకటి జరగడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఓ వ్యాపారి కుటుంబంలో ముగ్గురిని దుండగుడు పొట్టనపెట్టుకున్నాడు.
చెన్నై పారిన్ కార్నర్లోని షాపుకారుపేటకు చెందిన దలీల్ (74) ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. దుండగులు ఆయన నివాసంలోకి చొరబడిన ఆయనతో పాటు అతని భార్య కుషాల్ భాయ్ (70), కుమారుడు సీతల్ (38) పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీపీ మహేష్ కుమార్ అగర్వాల్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ ఘతకానికి ఎవరు పాల్పడ్డారు అనేది పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
సీసీ పుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనకు కుటుంబ తగాదాలు కారణమా? లేక దలీల్ చేస్తున్నది ఫైనాన్స్ వ్యాపారం కావడం వల్ల వ్యాపార లావాదేవీల్లో శత్రులు ఈ పని చేసి ఉంటారా? అనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.