విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై గరికపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గరికపాడు ఫ్లైఓవర్పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
ఖమ్మం జిల్లా మధిరలోని ఆత్కూరుకు చెందిన మాచర్ల శ్యామ్ కుటుంబ సభ్యులు కారులో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మాచర్ల శ్యామ్ (60), శారద (55), శ్యామల (38) అక్కడికక్కడే మృతి చెందగా భాగ్యలక్ష్మి, నవీన్, మాన్యశ్రీ (7), గోపి(8), అక్షయ్, డ్రైవర్ సైదులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది.
దైవ దర్శనానికి వెళ్ళి వస్తూ..
కార్తీక మాసం సందర్భంగా శ్యామ్ కుటుంబ సభ్యులు వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తూ ఈ ప్రమాదానికి గురి అయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.