ఇటీవలి కాలం వరకు కరోనా మహమ్మారి వైరస్ సోకిన వ్యక్తి మరొక వ్యక్తిని తాకితే మాత్రమే సంక్రమిస్తుంది వైద్య నిపుణులు, శాస్త్ర వేత్తలు చెబుతూ వచ్చారు. అందుకే కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ముక్కుకు మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెబుతూ వచ్చారు.
అయితే ఇప్పుడు కరోనా వ్యాప్తి కి మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది. ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందనీ, ఈ విషయం పరిశీలించాలని దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ కు లేఖలు రాశారు. తొలుత ఈ వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చింది. అయితే శాస్త్రవేత్తల విజ్ఞప్తి పై పరిశీలన చేసిన అనంతరం కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.
జనంతో కిక్కిరిసిపోయిన, సరైన గాలి, వెలుతురు రాని గదుల్లో కరోనా బాధితులు ఉంటే..వారి ద్వారా ఇతరులకు వైరస్ సులభంగా వ్యపిస్తుందన్న వాదనలను తోసిపుచ్చలేమని డబ్ల్యు హెచ్ వో తాజాగా స్పష్టం చేసింది. అదే మాదిరిగా కరోనా లక్షణాలు కనిపించని బాధితుల నుండి సైతం వైరస్ గాలి ద్వారా సోకే ప్రమాదం ఉందని తెలిపింది.ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ని నియంత్రించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్వో ప్రభుత్వాలను కోరింది.
ఇప్పుడు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది. పాలకుల నిర్లక్ష్యం అయితే నేమి, ప్రజల బాధ్యతారాహిత్యం అయితే నేమి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో నేటి వరకు 8 లక్షల 50 వేల మందికి కరోనా సోకగా 22,674 మంది మృతి చెందారు. 5లక్షల 34 వేల మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.