అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై టిక్టాక్ ఉద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ తరువాత అమెరికాలో టిక్టాక్ బ్యాన్ అవుతుందని చెప్పి ట్రంప్ ఈ మధ్యే ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం కూడా చేశారు. అయితే టిక్టాక్ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కానీ చాలా తక్కువ వ్యవధి ఉండడంతో డీల్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో అమెరికాలో టిక్టాక్ బ్యాన్ తప్పదని అంటున్నారు.
అయితే టిక్టాక్ బ్యాన్ అవుతుందనే నేపథ్యంలో ఆ సంస్థ అమెరికా ఉద్యోగులు సుమారుగా 1500 మంది ఇప్పుడు ట్రంప్ సర్కారుపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. టిక్టాక్ను నిషేధించడం అన్యాయమని, అలా జరిగితే తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని, అమెరికా రాజ్యాంగం కల్పించిన హక్కులను ట్రంప్ సర్కారు కాలరాస్తుందనే ఆరోపణలతో టిక్టాక్ ఉద్యోగులు ట్రంప్ సర్కారుపై కోర్టులో దావా వేయనున్నారు.
కాగా ఈ విషయంతో తమకు సంబంధం లేదని టిక్టాక్ స్పష్టం చేసింది. అది తమ సంస్థ ఉద్యోగులు తీసుకున్న నిర్ణయమని తెలిపింది. కానీ వారి న్యాయపోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. మరోవైపు టిక్టాక్ను బ్యాన్ చేయాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ట్రంప్ సరైన నిర్ణయం తీసుకున్నారని అంటుంటే.. కొందరు మాత్రం.. యాప్ను నిషేధించడం ఎందుకని, అది కేవలం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్ అని, దాన్ని నిషేధించాల్సిన పనిలేదని అంటున్నారు. అయితే టిక్టాక్ బ్యాన్ విషయంలో చివరకు ఏమవుతుందో చూడాలి.