బ్రిటన్లో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ తీవ్రంగా విస్తరిస్తుండటం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కల్గిస్తోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని సంతోషిస్తున్న తరుణంలో కొత్త స్ట్రెయిన్ రావడం ప్రజలను, ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే ఈ కొత్త వైరస్ ఇతర దేశాల్లోనూ పాకినట్లు అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలతో పాటు భారతదేశం కూడా యూకె విమాన సర్వీసులను నిలుపుదల చేసింది. అయితే ఈ బ్యాన్ ఈ అర్థరాత్రి నుండి అమలు కానున్నది. మరో వైపు బ్రిటన్ నుండి పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. దీంతో ఇండియాలోని అన్ని విమానాశ్రాయాలలో ప్రయాణీకులకు కోవిడ్ టెస్ట్ లు చేస్తున్నారు. అయితే ఇండియాకు వస్తున్న వారిలో కొందరికి పాజిటివ్ నిర్ధారణ రావడం తీవ్ర ఆందోళన కల్గిస్తుంది.
నిన్న రాత్రి లండన్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చిన 266 మంది ప్రయాణీకులకు పరీక్షలు జరపగా అందులో అయిదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో విమానాశ్రయంలో కలకలం రేగింది. బ్రిటీష్ ఎయిర్ వేస్కు చెందిన మరో విమానం ఈ ఉదయం ఢిల్లీలో లాండింగ్ అయ్యింది. దీనిలో వచ్చిన ప్రయాణీకుల నుండి అధికారులు శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిమిత్తం పంపారు. యూకె నుండి కోల్కత్తాకు వచ్చిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా లండన్ నుండి ఢిల్లీ మీదుగా చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ నిర్ధారణ అయిన ప్రయాణీకులను ఐసోలేషన్కు పంపుతున్నారు. లండన్తో ప్రయాణ సంబంధం ఉన్న 1088 మందిని గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.