ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ అప్రమత్తమైంది.
ఇప్పటివరకు అటకెక్కిన అభివృద్ధి అంశాన్ని వైసీపీ ఇప్పుడు పట్టించుకుంటోంది.ఇంకా చెప్పాలంటే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అప్పుడు అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత హడావిడి చేసిందో అంతకు మించి వైసిపి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు చేయనున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.వైసీపీ అధికారంలోకొచ్చాక ఈ పదిహేను నెలల కాలంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇదే ఆవడం ,గెలుపు తప్పనిసరి కావడంతో ముఖ్యమంత్రి జగన్ కూడా ఏ ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదట.పక్కా ఏర్పాట్లతో ఉప ఎన్నికల బరిలో దిగి మొన్నటి ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ సాధించి టిడిపి ఇతర ప్రతిపక్షాలు నోళ్ళు మూయించటానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారట .నిజానికఇప్పటి వరకూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు.
అభివృద్ధి కార్యక్రమాలను జగన్ పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పదిహేను నెలలుగా పడకేశాయనే చెప్పాలి.అయితే అనూహ్యంగా ఉప ఎన్నిక వస్తుండటం, విజయం తప్పనిసరి కావడంతో జగన్ అప్రమత్తమయ్యారు. తిరుపతి పార్లమెంటు నియోజకవవర్గం పరిధిలో ఉన్న సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులపై సీఎంవో కార్యాలయం ఆరా తీస్తోంది.
మరి కొద్ది రోజుల్లోనే ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా నిధులను విడుదల చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులను పంపాలని సీఎంవో కోరడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఖుషీగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలకు మెజారిటీ టార్గెట్ ను కూడా జగన్ విధించనున్నారు. ఉప ఎన్నికలో మెజార్టీ తీసుకురాలేని ఎమ్మెల్యేలను జగన్ వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టే అవకాశం ఉంది. గతంలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులను తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఆ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేల మెడపై కత్తి వేలాడుతున్నట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు..