Tirupati by poll : చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులలో ఒకరు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత. అలాంటి వ్యక్తి ప్రస్తుతం తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. ఇదే సమయంలో అనేక తప్పటడుగులు కూడా వేస్తున్నారు. జగన్ ఊపుని తట్టుకోలేక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా లేదా బాబు ఆలోచన ప్రక్రియలోని లోపాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయా అన్నది మాత్రం టిడిపి శ్రేణులకు అర్థం కావడం లేదు.
వివరాల్లోకి వస్తే… సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకులు గా అందరికీ సుపరిచితులు. అయితే అతను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పాతికేళ్లు అవుతుంది అంటే ఒక ప్రజా నాయకుడిగా అతను ఏ రేంజ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన చివరిగా అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచింది 1999లో. నెల్లూరు జిల్లా సర్వేపల్లి లో ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఎన్నికల్లో పోటీ చేసినా రెడ్డిగారు ఓడిపోవడమే. 2004 నుండి 2019 వరకు వరుస పరాజయాలతో డీలా పడిపోయిన సోమిరెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ ని ఇచ్చి ఏకంగా మంత్రిని చేశారు. ఇక తన సొంత ప్రాంతం లోనే ఇలా వరుసగా ఓడిపోతున్నాడు అంటే ఆయనకున్న ఇమేజ్ ఏమిటో అర్థం అయిపోతుంది.
అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో మెయిన్ రోల్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యపరిచింది. అసలు సీనియర్ నేత అయినప్పటికీ అతనికి తిరుపతి పార్లమెంటు గెలిపించేంత సీన్ లేదని టిడిపి పార్టీకి మొత్తం తెలుసు. మరి చంద్రబాబు కు ఇంత చిన్న విషయం తెలియదా… అంటే తెలిసి ఉండొచ్చు కానీ సోమిరెడ్డికి పూర్తి బాధ్యత అప్పగించారు. అసలు ఆయన ప్లాన్ ఏమిటో ఆ పార్టీలోని నేతలకి అసలు అర్థం కావడం లేదు. తన నియోజకవర్గంలోనే గెలవలేకపోతున్న సోమిరెడ్డి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ని ఎలా గెలిపించగలరు అన్న అనుమానం మొదలైంది.
టీడీపీతో కలుపుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా బలహీనంగా ఉన్న సమయంలో…. వారితో పోలిస్తే టిడిపి మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత సోమిరెడ్డి వంటి నేతకు ఇవ్వడం పూర్తిగా అనాలోచిత చర్య అని అంటున్నారు. మరి దీనికి సమాధానం చంద్రబాబు దగ్గర నుండి ఉంటుందా లేదా రిజల్ట్ రూపంలో సోమిరెడ్డి దగ్గర్నుంచే ఉంటుందా అన్నది చూడాలి.