Tirupati Bypoll : తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ గతంలో జగన్ ను అభినందిస్తూ ఉన్న ఒక ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసినదే. ఈ ట్వీట్ ను అటు వైసీపీ తో పాటు తేదేపా సోషల్ మీడియా వారు గట్టిగా వాడుతున్నారు. వైసీపీ వారేమో ఆమె మాకు మద్దతు పలికే వ్యక్తే అని చెప్పుకుంటుంటే టీడీపీ వాళ్ళు ఏమో ఆమె కూడా జగన్ మనిషే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆమె ఈ అంశం మీద స్పందించారు. తిరుపతిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ సీఎం గా గెలిచినప్పుడు నేను అభినందిస్తూ ట్వీట్ చేసిన మాట వాస్తవం అని పేర్కొన్న ఆమె అలా అభినందిస్తే తప్పేముంది ? అని ప్రశ్నించారు.
ఏపీ అంటేనే మక్కువ!
ఆంధ్రభూమి నా జన్మభూమి కర్ణాటక నా కర్మభూమి అని అన్నారు. నాకు ఎప్పుడూ నా సొంత రాష్ట్రంలో పని చేయాలని కోరిక ఉండేదన్న ఆమె నేను సెన్సార్ బోర్డు మెంబర్ గా ఆరువందల సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చానని అన్నారు. సొంత రాష్ట్రం మీద అభిమానంతో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు. నేను ఎంపీగా గెలిస్తే పార్లమెంట్ లో ఇక్కడి సమస్యల గురించి ధైర్యంగా మాట్లాడతానని అన్నారు. మన కంఠం పార్లమెంట్ వరకూ వినిపిస్తానన్న ఆమె వైసీపీలో 22 మంది ఎంపీలు ఉన్నారు కానీ ఒక్క ఎంపీ అయినా వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద అయినా మాట్లాడారా?? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ మద్దతు పక్కా!
జనసేన పార్టీ మాకు 200 శాతం మద్దతు ఇస్తోందని ఆమె చెప్పారు.జనసేనాని పవన్ కల్యాణ్ మిత్రధర్మాన్ని పాటిస్తారని తప్పనిసరిగా తిరుపతిలో బీజేపీ గెలుపునకు కృషి చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు రెండువేలు తీసుకుని అవినీతి పరులకు ఓట్లు వేయొద్దని అన్నారు. ఇక రేపు ఉప ఎన్నికకు నామినేషన్ వేస్తున్నానని, నేను గెలిస్తే…మీ సమస్యలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తానని అన్నారు. ఇక్కడి వారిని గెలిపిస్తే… ధైర్యంగా మాట్లాడే వారు ఎవరు లేరని ఆమె అన్నారు. గెలిచిన ఎంపిలు పార్లమెంటులో లేచి నిలబడి వారి సమస్యలు మాట్లాడిన వైకాపా ఎంపీ ఒక్కరూ లేరని ఆమె అన్నారు. ప్రజలు ఆలోచన మారాలని, నీతి నిజాయితీ ఓటు వేయాలా..లేక డబ్బులు వేయాలా అనేది డిసైడ్ అవ్వాలని ఆమె కోరారు.మొత్తంగా చూస్తే రత్నప్రభ ప్రచార మెళుకువలు ఆకళింపు చేసుకుని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?