Tirupati By Poll: తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందనీ, వేరే ప్రాంతాల నుండి దొంగ ఓట్లు వేయడానికి జనాలను వాహనాల్లో తీసుకువచ్చారని టీడీపీ ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఒక పక్క వైసీపీపై టీడీపీ ఆరోపణ చేస్తుండగా టీడీపీ నేతలపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఇఓ) కే విజయానంద్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రైవేటు బస్సుల్లో వచ్చిన భక్తులను టీడీపీ నేతలు అడ్డుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. భక్తులను దొంగ ఓటర్లు అంటూ ఆందోళన చేస్తూ ఓటర్లను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు.
మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తిరుమలకు వచ్చే భక్తులను దొంగ ఓటర్లు అని దుర్మార్ఘమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు రాలేదని అన్నారు. తనకు తిరుపతిలో సొంత ఇల్లు ఉందనీ, చంద్రబాబుకే రాష్ట్రంలో ఎక్కడా సొంతిల్లు లేదని విమర్శించారు. జూమ్ లో చంద్రబాబు, ట్విట్టర్ లో లోకేష్ కనబడతారంటూ పెద్దిరెడ్డి సెటైర్ వేశారు.
దొంగ ఓట్లు వేసే అవసరం వైసీపీకి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. తిరుపతికి వచ్చే యాత్రికులను దొంగ ఓటర్లని దుష్ప్రచారం చేయడం హేయమన్నారు.